ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాశ్మీర్ గాజా కాదు.. రక్తపాతం లేకుండా సమస్యను మోదీ పరిష్కరించారు: షెహ్లా రషీద్

national |  Suryaa Desk  | Published : Wed, Nov 15, 2023, 08:11 PM

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంపై జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ స్టూడెంట్‌ లీడర్‌ షెహ్లా రషీద్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే గాజా పరిస్థితి కాశ్మీర్‌కు రాకుండా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలే కారణమని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ స్టూడెంట్ లీడర్ షెహ్లా రషీద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగానే కేంద్ర ప్రభుత్వంపై ఆమె ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ సమర్థవంతమైన నాయకత్వం కారణంగానే రక్తపాతం లేకుండా కాశ్మీర్‌కు పరిష్కారం లభించిందని షెహ్లా రషీద్ ప్రశంసించారు. ఈ క్రమంలోనే కాశ్మీర్‌లోని పరిస్థితులను గాజాతో పోల్చకూడదని షెహ్లా రషీద్ తెలిపారు.


అయితే గతంలో కాశ్మీర్‌లో ప్రజలు, సైన్యంపైకి రాళ్లు విసిరే ఆందోళనకారులు, వేర్పాటు వాదులకు మద్దతుగా తాను మాట్లాడానని.. కానీ ఇప్పుడు మాత్రం కాశ్మీర్‌లో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదని షెహ్లా రషీద్ వెల్లడించారు. కాశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూసిన తర్వాత తాను కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి రుణపడి ఉన్నానని తెలిపారు. ఈ క్రమంలోనే కాశ్మీర్‌లోని పరిస్థితులను గాజాతో పోల్చలేమని షెహ్లా రషీద్ తేల్చిచెప్పారు. కాశ్మీర్ ప్రాంతం అనేది మరో గాజా కాదని ఇప్పటికే స్పష్టమైందని పేర్కొన్నారు. గతంలో కాశ్మీర్‌లో అక్రమ చొరబాట్లు, తిరుగుబాట్లు, ఆందోళనలు జరిగేవని.. అయితే ఇలాంటి ఉద్రిక్తతలకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపించిందని షెహ్లా రషీద్ పేర్కొన్నారు. అది కూడా రక్తపాతం లేకుండా శాంతియుతంగా కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపించిన క్రెడిట్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకే దక్కుతుందని తెలిపారు. రాజకీయంగా ఈ సమస్యకు పరిష్కారం చూపారని పేర్కొన్నారు.


అయితే జమ్మూ కాశ్మీర్‌లోని పరిస్థితుల గురించి భారత ప్రభుత్వంపై షెహ్లా రషీద్‌ ప్రశంసలు కురిపించడం ఇదేం తొలిసారి కాదు. జమ్మూ కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు తగ్గాయని.. ప్రభుత్వ పాలన మెరుగుపడిందని ఈ ఆగస్టులో షెహ్లా రషీద్ కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ చర్యలతో కాశ్మీర్ ప్రజలు ప్రాణాలకు భద్రత ఏర్పడిందని అన్నారు. ఇక ప్రస్తుతం గాజా భూభాగంలో ఇజ్రాయెల్‌ సైన్యం చేస్తున్న భీకర దాడులపై స్పందించిన షెహ్లా రషీద్.. భారతీయులుగా మనం ఎంతో అదృష్టవంతులమని పేర్కొన్నారు. కాశ్మీర్‌లో శాంతి, పౌరుల రక్షణ కోసం ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, జమ్మూ కాశ్మీర్‌ పోలీసులు ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు.


2016 లో జేఎన్‌యూలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి నాయకుల్లో షెహ్లా రషీద్‌ కూడా ఉన్నారు. ఆ తర్వాత కూడా ఆమె మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాశ్మీర్‌లో ఉన్న ఇళ్లను సైన్యం ధ్వంసం చేస్తూ బీభత్సం సృష్టిస్తోందని 2019 లో ఆరోపించారు. మరోవైపు.. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ షెహ్లా రషీద్ సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ ఆగస్టులో ఆమె తన పిటిషన్‌ను అనూహ్యంగా ఉపసంహరించుకోవడం సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి ఆమె కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa