ఏపీ స్కిల్ డెవలెప్మెంట్ కేసులో టీడీపీకి నోటీసులు అందజేసింది సీఐడీ. పార్టీ అకౌంట్కు ముడుపుల రూపంలో రూ.27 కోట్లు అందాయని సీఐడీ ఆరోపించింది. పార్టీ జమా ఖర్చుల వివరాలు చెప్పాలంటూ ఇప్పుడు నోటీసులపై నోటీసులు అందజేసింది. 2015 నుంచి 2019 వరకు జమాఖర్చుల వివరాల్ని ఈ నెల 18లోగా సమర్పించాలంటూ సీఐడీ పోలీసులు టీడీపీకి నోటీసులిచ్చారు. రెండు బ్యాంకుల్లోని టీడీపీ అకౌంట్ల వివరాల్నీ అందజేయాలని కోరారు. మంగళవారం ఉదయం సీఐడీ విభాగం నుంచి ఒక కానిస్టేబుల్ టీడీపీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ అశోక్బాబుకు నోటీసు అందజేశారు.
ఈ అంశంపై టీడీపీకి సీఐడీ నోటీసివ్వడం ఇది మూడోసారి.. మొదట ఈ నెల 4న నోటీసు ఇచ్చిన సీఐడీ.. ఐదేళ్ల ఆదాయ వ్యయాల వివరాల్ని అదేరోజు సమర్పించాలని కోరింది. టీడీపీ స్పందించకపోవడంతో.. ఆ మరుసటి రోజే మరో నోటీసిచ్చింది. నాలుగు వారాల గడువు కావాలని టీడీపీ కోరినట్టు సమాచారం. దీంతో సీఐడీ మళ్లీ నోటీసు ఇచ్చింది. ఆ రూ.27 కోట్లు పార్టీ కార్యకర్తలు సభ్యత్వ రుసుముగా చెల్లించిన మొత్తమని టీడీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. పైగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చిన విరాళాల వివరాల్ని ఎవరికీ చెప్పాల్సిన అవసరం చట్ట నిబంధనల ప్రకారం లేదని తేల్చిచెప్పింది.
అయితే సీఐడీ తాజా నోటీసులపై టీడీపీ న్యాయవిభాగం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఏ కేసులోనైనా ఆధారాలు సేకరించాక కేసు ఫైల్ చేయాలి. కానీ స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించి సీఐడీ మొదట కేసు నమోదు చేసి, ఇప్పుడు ఆధారాల కోసం వెతుకుతోందని టీడీపీ తరఫు లాయర్లు అంటున్నారు. 2022లో నమోదు చేసిన ఆ కేసులో ఎలాంటి ఆధారాల్లేకుండానే ఈ ఏడాది సెప్టెంబరు 9న చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఏదోరకంగా ఆ నేరాన్ని అంటగట్టేందుకు పార్టీకి ముడుపులు అందాయంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు
రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించడం తప్పు కాదని.. టీడీపీ తన ఆదాయ, వ్యయాల ఆడిట్ నివేదికల్ని ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పిస్తోంది అంటున్నారు. ఆ వివరాల్ని అడిగే హక్కు సీఐడీకి లేదని.. దర్యాప్తు పేరుతో నోటీసు ఇచ్చేందుకూ సీఐడీకి హక్కు లేదని వాదిస్తోంది టీడీపీ. అంతేకాదు ఇప్పటికే టీడీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది.. విచారణ, నోటీసుల పేరుతో వేధిస్తోందని పిటిషన్ దాఖలు చేసింది. టీడీపీ నేత వర్ల రామయ్య కోర్టుకు వెళ్లారు. దీంతో సీఐడీ టీడీపీకి ఇచ్చిన నోటీసులపై చర్చ జరుగుతోంది. టీడీపీ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa