ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాజ్‌మహల్‌లో చెత్తను తొలగించిన విదేశీ పర్యాటకురాలు.. బీజేపీపై అఖిలేష్ ఫైర్

national |  Suryaa Desk  | Published : Sun, Nov 19, 2023, 09:51 PM

తాజ్‌మహల్. దేశ రాజధాని ప్రాంతంలో ఉన్న అద్భుతమైన కట్టడాన్ని చూసేందుకు దేశవిదేశాల నుంచి నిత్యం ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే ఢిల్లీలో కాలుష్యం నేపథ్యంలో అద్భుతమైన తాజ్ మహల్ తన అస్తిత్వాన్ని కోల్పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ తాజాగా మరో సంఘటన దేశ ప్రతిష్ఠకు తీవ్ర భంగం వాటిల్లేలా ఉంది. ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిన తాజ్ మహల్ పరిసరాలు చెత్తా చెదారంతో నిండిపోయాయి. అయితే తాజ్‌ చూసేందుకు వెళ్లిన ఓ విదేశీ మహిళ ఆ చెత్తను తొలగించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు.


తాజ్‌మహల్ అందాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. తాజ్ మహల్ చూసేందుకు పర్యాటకులు ఎగబడుతుండగా.. తాజ్ ప్రాంతంలో కాలుష్యం, పరిశుభ్రతకు సంబంధించి తరచూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాలతో సహా పక్కనే ఉన్న యమునా నది కాలుష్యం పెరుగుతుండటంతో తాజ్ ప్రేమికుల్లో గుబులు రేపుతోంది. అయితే తాజాగా తాజ్ మహల్ లోపల కూడా పరిశుభ్రత లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే తాజ్ మహల్ సందర్శనకు వెళ్లిన ఒక విదేశీ పర్యాటకురాలు.. అక్కడ ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తాజ్ పరిశుభ్రతపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.


అయితే ఇది రాజకీయంగా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పర్యాటకురాలిగా వచ్చిన ఓ విదేశీ మహిళ.. తాజ్ మహల్‌ను శుభ్రం చేయడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనంటూ సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితికి తీసుకువచ్చి.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశం పరువు తీసిందంటూ అఖిలేష్ ఆరోపించారు. గతంలో చీపురు పట్టుకుని లక్నో వీధుల్లో హడావుడి చేసిన వారు ఇప్పుడు ఎక్కడికి పోయారంటూ నిలదీశారు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట పెరిగిందని నరేంద్ర మోదీ సర్కార్ ప్రచారం చేసుకుంటోందని.. అయితే వాస్తవ పరిస్థితి ఇదేనని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


అయితే ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారడంతో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా-ఏఎస్ఐ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ రాజ్‌కు‌మార్ పటేల్ స్పందించారు. తాజ్ మహల్ పరిశుభ్రతపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే ఆ విదేశీ మహిళ.. కావాలనే అలా చెత్తను తీస్తున్నట్లు ఫొటోలు, వీడియో తీసుకుందని తెలిపారు. తాజ్‌మహల్‌లోని పలు చోట్ల డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేసి సిబ్బందితో ఎప్పటికప్పుడు శుభ్రతను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa