దేశంలో జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో ధన ప్రవాహం కట్టలు తెంచుకుంటోంది. గతంలో 2018 ఎన్నికల్లో ఈ ఐదు రాష్ట్రాల్లో పట్టుబడిన వస్తువులు, డబ్బు కంటే ఇప్పటికే 7 రెట్లు అధికంగా జప్తు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు గిఫ్ట్లు, డ్రగ్స్, నగదు, మద్యం, బంగారం, వెండి సహా ఇతర వస్తువులను పట్టుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. వీటన్నింటి విలువ రూ.1760 కోట్లు ఉంటుందని తెలిపింది.
2018 లో కూడా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అయితే ఆ సమయంలో మొత్తం కలిపి రూ. 239.15 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అయితే ఈసారి అదే 5 రాష్ట్రాల్లో ఇప్పటివరకు జప్తు చేసిన వస్తువుల విలువ ఏడు రెట్లు పెరిగి రూ.1760 కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించింది. ఇక ఈ 5 రాష్ట్రాల్లో అత్యధికంగా తెలంగాణలోనే పట్టుకున్నట్లు తెలిపింది. ఒక్క తెలంగాణలోనే కేవలం డబ్బే రూ. 225.25 కోట్లు సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. రాజస్థాన్లో ఈనెల 25 వ తేదీన.. తెలంగాణలో ఈ నెల 30 వ తేదీల్లో పోలింగ్ జరగనుంది.
తెలంగాణలో మొత్తం రూ. 659 కోట్ల విలువ గల నగదు, మద్యం, డ్రగ్స్, బహుమతులు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇక రాజస్థాన్లో రూ. 93.17 కోట్లు, మధ్యప్రదేశ్లో రూ. 33.72 కోట్లు సీజ్ చేసినట్లు సీఈసీ తెలిపింది. విచిత్రంగా మిజోరంలో ఎలాంటి నగదు గానీ.. బంగారం, వెండి గానీ పట్టుబడలేదని వెల్లడించింది. అయితే రూ. 29.82 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంకా ఎన్నికలు పూర్తి కాలేదని.. పోలింగ్ పూర్తయ్యే నాటికి ఈ సంఖ్యలు మరింత భారీగా పెరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది.
అయితే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో చీఫ్ సెక్రటరీలు డీజీపీలు, ఎక్సైజ్ కమిషనర్లు, ఇన్కమ్ టాక్స్ అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోంది. 228 మంది కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు అబ్జర్వర్లుగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. గతంలో నిర్వహించిన 6 రాష్ట్రాలు ఎన్నికల్లో మొత్తం డబ్బు, మద్యం, డ్రగ్స్ ఇతర బహుమతులు కలిపి రూ.1000 కోట్లు పట్టుబడగా.. ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకే రూ.1760 కోట్ల విలువైన నగదు, మద్యం పట్టుబడినట్లు ఈసీ స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa