ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామమందిర ప్రారంభోత్సవం.. అయోధ్యలో టెంట్ సిటీల నిర్మాణం

national |  Suryaa Desk  | Published : Tue, Nov 21, 2023, 09:36 PM

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలి రానున్నారు. సామాన్య ప్రజల నుంచి మొదలుపెడితే వీఐపీలు, వీవీఐపీలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతి ఏర్పాటు చేసేందుకు అయోధ్యలో టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నారు.


ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఇటీవలె ఖరారు అయింది. వచ్చే ఏడాది జనవరి 22 వ తేదీన మృగశిర నక్షత్రంలో అభిజీత్‌ ముహూర్తంలో 12.20 గంటలకు రాముడి విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు కల్పించే విషయంలో ప్రణాళికలు రచిస్తున్నారు. వేలాది మంది భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు టెంట్‌ సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తాజాగా అధికారులు వెల్లడించారు.


శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌, అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ సంస్థలు భక్తులకు తాత్కాలిక వసతుల ఏర్పాట్లు చేస్తున్నాయి.


అయోధ్య నగరంలోని మాజా గుప్తర్‌ ఘాట్‌, బాగ్‌ బిజేసీ, బ్రహ్మకుండ్‌ వంటి ప్రాంతాల్లో భక్తుల కోసం తాత్కాలికంగా టెంట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మాజా గుప్తర్‌ ఘాట్‌ వద్ద 20 ఎకరాల్లో 25 వేల మందికి వసతి కల్పించేలా నిర్మాణం చేస్తున్నారు. బ్రహ్మకుండ్‌ వద్ద 30 వేల మందికి.. బాగ్‌ బిజేసీ వద్ద 25 వేల మందికి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్‌సేవక్‌ పురం, మణిరాం దాస్‌ కంటోన్మెంట్‌ వంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి వసతి ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు.


అయితే అయోధ్య రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం శీతాకాలంలో సంక్రాంతి పండగ తర్వాత నిర్వహిస్తుండటంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి.. భక్తులు చలికి వణికిపోయే ప్రమాదం ఉందని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే వారిని చలి బారి నుంచి రక్షించేందుకు ఈ టెంట్ సిటీలను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. భక్తుల కోసం పరుపులు, దుప్పట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. భక్తుల ఆకలి తీర్చేందుకు ఆహార సరఫరా ఏర్పాట్లు, అనారోగ్యానికి గురైతే వైద్య సహాయం కల్పించేందుకు మెడికల్ శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారని.. వాటికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa