పాఠశాల పుస్తకాల్లో మార్పులు చేర్పులకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కమిటీ -ఎన్సీఈఆర్టీ కీలక ప్రతిపాదనలు చేసింది. సాంఘిక శాస్త్రంలోని చరిత్ర పుస్తకాల్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని ఈ కమిటీ సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు స్కూలులోని క్లాస్ రూం గోడలపై రాజ్యాంగ పీఠికను స్థానిక భాషల్లో రాయాలని ఎన్సీఈఆర్టీ కమిటీ సూచించినట్లు తాజాగా కొన్ని మీడియా కథనాలు తెలిపాయి. సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఎన్సీఈఆర్టీ నియమించిన ఉన్నత స్థాయి కమిటీ.. ఈ సబ్జెక్టులోని పాఠ్యాంశాల్లో పలు మార్పులను ప్రతిపాదించింది. అయితే ఈ వార్తలపై స్పందించిన ఎన్సీఈఆర్టీ.. ప్రస్తుతానికి ఇంకా సిలబస్ రూపకల్పన జరుగుతోందని చెప్తూ వివరాలు వెల్లడించలేదు.
ప్రస్తుతం సోషల్ సైన్సెస్ పాఠ్యాంశాల్లో ఉన్న చరిత్రను 3 విభాగాలుగా విభజించారు. అవి ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలకు సంబంధించిన చరిత్రను తెలియజేస్తుంది. అయితే ఈ చరిత్రను 4 భాగాలుగా విభజించాలని ఎన్సీఈఆర్టీ ప్యానెల్ సిఫార్సు చేసింది. క్లాసిక్ పీరియడ్ (సాంప్రదాయ చరిత్ర), మధ్య యుగం, బ్రిటిష్ కాలం, ఆధునిక భారతం.. ఈ 4 భాగాలుగా మన దేశ చరిత్రను వర్గీకరించి చరిత్రను బోధించాలని సూచించింది. సాంప్రదాయ చరిత్రలో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, పురాణాలను చేర్చాలని పేర్కొంది. రాముడు ఎవరు.. ఆయన ఉద్దేశాలు ఏంటీ.. అనే విషయాలను విద్యార్థులు తెలుసుకోవాలని.. ఇతిహాసాల గురించి కనీస అవగాహన అయినా ఈ తరం విద్యార్థులకు ఉండాలని ఎన్సీఈఆర్టీ కమిటీ ఛైర్మన్ సీఐ ఐజాక్ వెల్లడించారు.
మరోవైపు.. చరిత్ర పుస్తకాల్లో భారతీయ రాజుల పాలన గురించి మరింత సమాచారాన్ని అందించాలని ఎన్సీఈఆర్టీ కమిటీ సిఫార్సు చేసింది. సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల పాఠాలను చేర్చాలని పేర్కొంది. మరోవైపు.. ఇకనుంచి దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలోని క్లాస్ రూమ్ గోడలపై రాజ్యాంగ పీఠికను రాయాలని ప్రతిపాదించింది. ఇక పాఠ్య పుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్ అనే పేరును వాడాలని ఇప్పటికే ఈ ఎన్సీఈఆర్టీ కమిటీ సిఫార్సులు చేసింది.
అయితే సోషల్ సైన్సెస్ సిలబస్లో భాగంగా చరిత్ర పాఠ్యాంశాల్లో కమిటీ సిఫార్సుల గురించి మీడియాలో వచ్చిన కథనాలపై తాజాగా ఎన్సీఈఆర్టీ స్పందించింది. పాఠ్యపుస్తకాల్లో కొత్త సిలబస్ రూపకల్పన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని.. అయితే వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని స్పష్టం చేసింది. అయితే ఎన్సీఈఆర్టీ ప్యానెల్ ఇచ్చిన సిఫార్సులకు ఇంకా ఎన్సీఈఆర్టీ నుంచి ఆమోదం లభించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa