సాగర తీరాన ప్రముఖ పర్యాటక ప్రాంతమైన విశాఖలోని కైలాసగిరి దిగువన చేపట్టిన తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు వెలువరించింది. నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని, వీటిని అడ్డుకోవాలని పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. తెన్నేటి పార్క్.. పార్కింగ్ కోసం కొండను తవ్వుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా కొండను తవ్వి నిర్మాణం చేపట్టారని పిటిషనర్ ఆరోపించారు. ఈ మేరకు పిటిషనర్ తరఫు న్యాయవాది కేఎస్ మూర్తి దాఖలు చేసిన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కైలాసగిరి కొండ దిగువ తవ్వకాలను నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది.. దీనిపై కౌంటరు దాఖలు చేయాలని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. కాగా, విశాఖ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో కైలాసగిరి ఒకటి. పేరుకు తగినట్లే భువిపై ఉన్న కైలాసంలా అనిపిస్తుంది. విశాఖ నగరానికి ప్రధాన ఆకర్షణగా, ఏ మూల నుంచి చూసినా కనిపించే విధంగా ఈ పర్వత ప్రాంతం ఉండటం విశేషం. సముద్ర తీరానికి ఆనుకుని కైలాసగిరి పక్కనే తెన్నేటి విశ్వనాథం పార్కు ఉంటుంది. దీని పార్కింగ్ స్థలం కోసమే కొండ దిగువన తవ్వకాలు జరుపుతున్నట్టు పిటిషనర్లు ఆరోపించారు. దీని వల్ల కైలాసగిరికి ముప్పు ఏర్పడుతుందని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa