పుట్టపర్తిలో జరుగుతున్న భగవాన్ శ్రీసత్యసాయి 98వ జయంతి వేడుకలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బెంగళూరు నుంచి వాయుసేన విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి మధ్యాహ్నం 2.35 గంటలకు చేరుకున్న ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మంత్రి ఉషశ్రీ చరణ్, సత్యసాయి ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన ఆమె ప్రశాంతి నిలయానికి చేరుకుని.. సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు.
అక్కడ నుంచి సాయిహీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కు రాష్ట్రపతి చేరుకున్నారు. అక్కడ జరిగిన సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 14 మందికి డాక్టరేట్లు, 21 మందికి విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. స్నాతకోత్సవంలో ప్రసంగించారు. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య అవసరమని, ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని విద్యార్థులకు ముర్ము సూచించారు. ఆధ్యాత్మిక చింతనతో సమాజసేవ చేయాలని ఆమె అన్నారు.
సత్యసాయి బాబా సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని, విద్య, వైద్యం, తాగునీరు, ఆధ్యాత్మికత విస్తరణకు బాబా ఎంతగానో కృషి చేశారని రాష్ట్రపతి కొనియాడారు. పుట్టపర్తిలో దాదాపు రెండు గంటల పాటు రాష్ట్రపతి పర్యటన కొనసాగింది. స్నాతకోత్సవం పూర్తయిన తర్వాత సాయంత్రం 4.20 గంటలకు రోడ్డు మార్గాన సత్యసాయి విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. అంతకు ముందుకు తన సొంత రాష్ట్రం ఒడిశాలోని పలు కార్యక్రమాల్లో ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 1.05 గంటలకు బయలుదేరి 2.35 గంటలకు పుట్టపర్తికి చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa