మెఘా సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ ఆరోపణ ముమ్మాటికీ అబద్ధమని, రుణానికి సంబంధించిన పూర్తి బాధ్యత మెఘా సంస్థదేనని, ప్రభుత్వానికి సంబంధం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్రెడ్డి స్పష్టంచేశారు. టీడీపీ దోపిడీ గురించి మాట్లాడటం గజదొంగే.. దొంగ, దొంగ అని అరిచినట్లుందని ఎద్దేవా చేశారు. టీడీపీ ఆరోపణలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తిప్పికొట్టారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు..మంత్రి బుగ్గన మాట్లాడుతూ..... ఒక ఫ్రెషర్ చంద్రబాబు నాయుడు కళ్లల్లో పడడం కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారు. అర్థంలేని ఆరోపణలతో విమర్శిస్తుంటారు. ఇటీవల కూడా ఆయన అదే చేశారు. మెఘా కంపెనీ ప్రభుత్వ గ్యారంటీతో రూ. 2000 కోట్లు అప్పు తెచ్చుకుందని అర్థం లేకుండా ఆరోపించారు. దోచుకోవడానికే ఇలా చేశారని వితండవాదం చేశారు. గ్యారంటీ లెటర్ అంటే ఏంటో మీకు కనీస అవగాహన లేదు. ఈ విషయం తప్పు కాదనే ఆర్థిక అంశాలలో అవగాహన ఉన్న మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల ఏం మాట్లాడడం లేదు. ఏ పనీ చేయకుండా ఏదో చేస్తున్నామనేలా హైప్ చేసి స్కిల్ డెవలప్ మెంట్ లో రూ.241 కోట్లు దోచుకుందెవరు? రాజధాని అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు? ఇన్నర్ రింగ్ రోడ్డుని మెలికలు తిప్పి అక్రమాలకు పాల్పడిందెవరు? సామాన్య ప్రజలలో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ సంక్షేమ విధానాలు, పరిపాలన మీద ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయాలనే కుట్రతో ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అని మా మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని ప్రజలకు స్పష్టమవుతుంది అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa