ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేసింది. అమరావతే ఏపీ రాజధాని అని స్పష్టం చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ఆమోదించినట్లు వెల్లడించిన కేంద్ర సర్కారు.. దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను విడుదల చేసింది. అందులో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం కల్పించింది. రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. దేశంలోని 39 శాతం రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్నది నిజమా? కాదా? అని ఈ సందర్భంగా ఎంపీ ప్రశ్నించారు.
ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సమాధానం ఇస్తూ.. రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న మాట అవాస్తమని పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతితో సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని ఉద్ఘాటించారు. త్రిపుర రాజధాని అగర్తల, నాగాలాండ్ రాజధాని కోహిమా మినహా మిగతా రాజధానుల మాస్టర్ ప్లాన్లను కేంద్రం ఆమోదించినట్లు తెలిపారు.
విశాఖ నుంచి త్వరలోనే పరిపాలన మొదలుపెట్టేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్న వేళ.. కేంద్రం నుంచి రాజధానిపై ప్రకటన రావడం గమనార్హం. ఇప్పటికే పలు ప్రభుత్వ విభాగాలు, అధికారులకు కార్యాలయాలను కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువరించిన విషయం తెలిసిందే. డిసెంబరు నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభమవుతుందని సీఎం చేసిన ప్రకటనకు అనుగుణంగా.. రాజధాని తరలింపు ప్రక్రియ వేగవంతం చేసింది.
విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబరు 23న జీవో వెలువరించింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలు కేటాయిస్తూ.. మొత్తం 2.27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో రాజధానిపై పార్లమెంట్లో కేంద్రం స్పష్టత నివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa