ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. సంక్రాంతిలోపు మేనిఫెస్టో ఫైనల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 18, 2023, 07:15 PM

ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలో పొత్తుపై కసరత్తు కొనసాగుతోంది. ఎన్నికలకు సమయం మరింత దగ్గర పడుతుండటంతో ఇరు పార్టీ అధినేతలు ఉమ్మడి కార్యాచరణపై ఫోకస్ పెట్టారు. మేనిఫెస్టోతో పాటుగా సీట్ల సర్దుబాటుపై త్వరగా తేల్చేయాలని భావిస్తున్నారు. ఆ దిశంగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు మరోసారి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. ఇద్దరు నేతలు సుమారు రెండున్నర గంటల పాటు పలు కీలక అంశాలపై చర్చించారు.. మరో ఒకటి రెండు సమావేశాలు జరగనున్నాయి.


సంక్రాంతి నాటికి సీట్ల పంపకాలపై క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో పైనా ఇద్దరు నేతలూ చర్చించారు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? ఎక్కడ నుంచి బరిలో దిగాలనే అంశంపై నేతలు చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏయే అంశాలు పెట్టాలి? దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణ, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఎవరెవరు హాజరవ్వాలి? వాటిని ఎప్పట్నుంచి ప్రారంభించాలనే అంశాలపైనా ఇద్దరు నేతలూ చర్చించారు. ఇద్దరూ కలిసి బహిరంగ వేదికపైకి వచ్చి కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు.. అదే వేదికపై నుంచి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం ఉంది.


ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రధాన అజెండాగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య ఆదివారం రాత్రి ప్రత్యేక భేటీ హైదరాబాద్‌లో జరిగిందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఇరు పార్టీల అధినేతల భేటీ చాలా సంతృప్తికరంగా సాగిందన్నారు. అనేక అంశాలపై చర్చలు సుహృద్భావంగా జరిగాయన్నారు. వైఎస్సార్‌సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ఉమ్మడి ధ్యేయంగా వచ్చే ఎన్నికల్లో సమష్టిగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా, ఉమ్మడి మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి..? దాని కోసం ప్రత్యేక వ్యూహంపైనా ఓ సమష్టి కార్యాచరణ తీసుకున్నామన్నారు. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ గురించి, ఎన్నికల యాక్షన్ ప్లాన్ గురించి చర్చించామన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఇరు పార్టీల అధినేతలు పూర్తి స్థాయిలో చర్చించారని.. అధికార పార్టీని దీటుగా ఎదుర్కోవడమే కాకుండా, వైఎస్సార్‌సీపీ విముక్త రాష్ట్రాన్ని సాధించేందుకు అవసరం అయిన అన్ని విషయాల పట్ల పూర్తిస్థాయి చర్చ జరిగిందన్నారు. అధినేతల మధ్య జరిగిన భేటీలో చర్చకు వచ్చిన ఇతర కీలకమైన అంశాల గురించి తర్వాత ప్రత్యేకంగా మాట్లాడుతామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa