జనసేన పార్టీ నేత, మెగా బ్రదర్ కొణిదెల నాగబబు రెండు ఓట్ల వివాదంపై స్పందించారు. తన ఓటు వ్యవహారం వివాదమం అవుతుందనే ఉద్దేశంతోనే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదన్నారు. ఎన్నికల వ్యవస్థపై తనకు గౌరవం ఉందని.. హైదరాబాద్లో ఉన్న తన ఓటును రద్దు చేసుకున్నానని తెలిపారు. దానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.. తన ఓటును ఆంధ్రప్రదేశ్కు మార్చుకొని జనసేన.. టీడీపీకి మద్దతుగా నిలుస్తామన్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు దీనిని వివాదం చేస్తున్నారన్నారు.
రాజకీయాలకు సంబంధించి ఒక కామెడీ మ్యాగజైన్ ఉందని.. అందులో తనకు రెండు ఓట్లు ఉన్నట్లు రాశారంటూ సెటైర్లు పేల్చారు. ఓటును మార్చుకుందామని భావించానని.. తన భార్యాపిల్లలు, కోడలు కూడా మంగళగిరిలో ఓటు నమోదు చేసుకోవాలని అనుకున్నామన్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తులు అందజేశామని.. అవి పరిశీలనలో ఉందన్నారు. ఏపీకి ఓటు మార్చుకోవాలనే హైదరాబాద్లో ఉన్న ఓటును తొలగించుకున్నా.. మంగళగిరిలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే రాకుండా బూత్ స్థాయిలోనూ వైఎస్సార్సీపీ నేతలు అడ్డుపడుతున్నారన్నారు.
ఎన్నికలకు మరో మూడు నెలలే గడువు ఉందన్నారు నాగబాబు. విలువైన కాలంలో కలిసికట్టుగా పోరాడాలని.. యుద్ధం చేస్తోంది బ్రహ్మ రాక్షసుడితో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ నేతలకు పరిపాలన అంటే కామెడీ అయిపోయిందని.. చివర్లో నోట్లు ఇస్తే ఓట్లు వేస్తారనే గుడ్డి నమ్మకంతో అభివృద్ధిని గాలికొదిలేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే జలవనరులశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోలవరాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికారన్నారు. నాలుగున్నరేళ్లు పూర్తవుతున్నా పురోగతి లేదన్నారు. ఆ తర్వాత వచ్చిన మంత్రి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందని అడిగితే త్వరలోనే అని చెప్పారని.. ఇప్పుడే అదే ప్రశ్న వేస్తే ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని మాట్లాడుతున్నారన్నారు.
పరిజ్ఞానం లేనివారు మంత్రులుగా రాష్ట్రాన్ని పాలిస్తుంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నోటికి ఏది వస్తే అది మాట్లాడతారని.. తిరుమల కనుమ దారిలో చిన్నారిని చిరుత చంపేస్తే తల్లిదండ్రులపై అనుమానం ఉందని అంటారని ధ్వజమెత్తారు. తనకు పదవులపై ఆసక్తి లేదన్నారు.. నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తాననేది ప్రచారమే అన్నారు. తాను నెల్లూరునే చదువుకున్నానన్న నాగబాబు.. జనసేన ఆవిర్భావం తర్వాత పలుమార్లు నెల్లూరుకు వచ్చానన్నారు. కేవలం జనసేన కార్యకర్తలలో స్ఫూర్తిని నింపేందుకే పనిచేస్తున్నామన్నారు. మంత్రి గోవర్ధన్ రెడ్డి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్న సోమిరెడ్డికి మద్దతు ఇస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసికట్టుగా ప్రజా సమస్యలపై పోరాడతాయన్నారు. ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉందని.. ఇరు పార్టీల కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa