గుంటూరు జిల్లా మంగళగిరిలో చిట్టీల పేరుతో ఏకంగా పోలీసులకే టోకరా ఇచ్చింది ఓ మహిళ. పెద్ద మొత్తంలో నగదుతో ఉడాయించింది. మంగళగిరి మండలం ఆత్మకూరులోని శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన ఇల్లూరు శ్రీదేవి అనే మహిళ గుడిమెట్ల రాజేష్, జనార్దనరావుతో కలిసి చిట్టీలు వేస్తున్నట్లు స్థానికంగా ఉన్న ఏపీఎస్పీ ఆరో బెటాలియన్లో పనిచేసే జవాన్లు వారి కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకుంది. దాదాపుగా 2016 నుంచి పోలీసులతో చిట్టీలు కట్టిస్తూ పెద్దమొత్తంలో వసూలు చేశారు. ఒక్కొక్కరు కనీసం రూ.5 లక్షల నుంచి రూ.20లక్షల వరకు చిట్టీలు కట్టారు. వారందరి దగ్గర నుంచి రూ.10 కోట్లకుపైగా వసూలు చేసిన శ్రీదేవి.. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. అనుమానంతో ఆరా తీస్తే.. అసలు సంగతి బయటపడింది.
ఏపీఎస్పీ ఆరోబెటాలియన్కు చెందిన కుసుమ అనే మహిళ 2016లో రూ.లక్ష చిట్టీ కట్టారు. దీనికి సంబంధించిన నగదును తన భర్త మురళీమోహన్రావు ఫోన్పే ద్వారా చెల్లించడంతో పాటు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి స్వయంగా నగదు తీసుకెళ్లేది. ఈ క్రమంలో బెటాలియన్లోని మరికొందరికి సంబంధించిన 11 చిట్టీలకు సుమారు రూ.15లక్షలు చెల్లించారు. ఇందుకుగాను రూ.20లక్షల వరకు శ్రీదేవి నుంచి చిట్టీల రూపంలో రావాల్సి ఉంది. నగదు అడిగినప్పుడల్లా ఈ రోజు, రేపు అంటూ మాయ మాటలు చెప్పిం తప్పించుకునేది. ఈ నెల 16వ తేదీ ఆమెకు కుసుమ ఫోన్ చేయగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. ఇంటికి వెళ్లగా తాళాలు వేసి ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 10వ తేదీ నుంచి తాళం వేసిఉన్నట్లు స్థానికులు గుర్తించారు. తనలాగా మరో 70 మంది నుంచి చిట్టీలు కట్టించుకుని రూ.10 కోట్లకుపైగా మోసం చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజేష్ అనే వ్యక్తి నగరపాలక సంస్థలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేశాడని స్థానికులు చెబుతున్నారు. బాధితులు ఫిర్యాదుతో పాటు 650 మందికి సంబంధించిన చిట్టీల వివరాలు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa