మానవ అక్రమ రవాణా జరుగుతోందని అనామక వ్యక్తి ఇచ్చిన సమాచారంతో 300 మందికిపైగా భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అదుపులోకి తీసుకోవడం కలకలం రేగుతోంది. దీనిపై ప్యారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఓ ప్రకటన చేసింది. రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్లైన్స్ విమానం దుబాయి నుంచి నికరాగ్వాకు బయలుదేరినట్లు ఫ్రాన్స్ అధికారులు వెల్లడించారు. ఎయిర్బస్ ఏ340 విమానంలో మొత్తం 303 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిపారు.
ఇంధనం నింపుకొనేందుకు ప్యారిస్ సమీపంలోని వ్యాట్రీ ఎయిర్పోర్టులో విమానం దిగిన వెంటనే ఫ్రాన్స్ పోలీసులు చుట్టుముట్టారు. అందులోని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మిగతా ప్రయాణికులకు బస ఏర్పాట్లు చేశారు. ఈ పరిణామాలపై లెజెండ్ ఎయిర్లైన్స్ తీవ్రంగా స్పందించింది. ఆ ఎయిర్లైన్స్ తరఫు లాయర్ లిలైనా బయకోకో మాట్లాడుతూ.. తాము ఎటువంటి తప్పు, నేరం చేయలేదని అన్నారు. అయితే ప్రాసిక్యూటర్లు అభియోగాలు నమోదు చేస్తే విమానయాన సంస్థ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఆమె చెప్పారు.
మరోవైపు, ఈ ఘటనపై ఫ్రాన్స్లో భారత రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది. భారతీయ అధికారులు అక్కడకు చేరుకుని, ప్రయాణికులకు అవసరమైన ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు. ‘ఫ్రాన్స్ అధికారులు 303 మందితో కూడిన విమానం అదుపులోకి తీసుకున్న విషయం గురించి మాకు తెలియజేశారు. దుబాయ్ నుంచి నికరాగ్వా వెళ్తున్న విమానంలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు.. ఫ్రెంచ్ విమానాశ్రయంలో సాంకేతికంగా నిలిపివేశారు. దౌత్య కార్యాలయ బృందం అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది... ప్రయాణీకుల క్షేమ సమాచారంపై కూడా ఆరా తీశారు’ అని ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. అయితే, అమెరికా లేదా కెనడాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించే ప్రయత్నంలో భాగంగా మధ్య అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఫ్రాన్స్లో దిగిన తర్వాత వారిని మొదట విమానంలో ఉంచారు. తర్వాత టెర్మినల్ భవనంలో బస ఏర్పాటు చేశారు. వాట్రీ విమానాశ్రయంలోని రిసెప్షన్ హాల్లో వారికి బస ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa