హిందూ-ముస్లిం ఐక్యతకు అద్దం పట్టే ఘటన ఇది. ఓ ముస్లిం సోదరుడు.. అయ్యప్ప మాలధారులకు తన ఇంటిలో భిక్షను ఏర్పాటుచేసి.. ఇతర మతాలపై తనుకున్న గౌరవాన్ని చాటుకున్నారు. స్వాములను తన నివాసానికి ఆహ్వానించి.. అన్నదానం చేశారు. ఇంటి వద్దే స్వయంగా వంటకాలు తయారుచేయించి.. భక్తితో వారికి వడ్డించారు. మత సామరస్యం వెల్లివెరిసిన ఈ ఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో చోటుచేసుకుంది. రాయచూర్ జిల్లాలోని కవితా టౌన్కు చెందిన కరీం సాబ్.. అయ్యప్ప స్వాములకు తన ఇంట్లో భిక్షను ఏర్పాటుచేశారు.
కరీం సాబ్ తన మతంతో పాటు ఇతర మతాలను కూడా గౌరవిస్తూ హిందూ-ముస్లింల ఐక్యతను కోరుకుంటారు. ఈ క్రమంలోనే అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయాలని ఆయన భావించారు. దీంతో వివిధ గ్రామాలకు చెందిన 58 మంది అయ్యప్ప స్వాములకు ఫోన్లో ఆహ్వానం అందించారు. ఆదివారం నాడు తన ఇంట్లోనే వంటకాలు సిద్ధం చేసి అయ్యప్ప స్వాములకు స్వయంగా వడ్డించారు. తన మతంపై ప్రేమ ఉందని, అదే సమయంలో ఇతర మతాలపైనా గౌరవం ఉందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే మతసామరస్యాన్ని చాటిచెప్పేందుకు వివిధ కార్యక్రమాలు చేస్తున్నానని కరీం సాబ్ వివరించారు.
అంతేకాదు, అయ్యప్ప స్వాములకు బిక్షను ఏర్పాటుచేయడం ఇది రెండోసారి అని ఆయన చెప్పారు. తనను ప్రేరణగా తీసుకుని మరికొందరు ముందుకొస్తారని కరీం సాబ్ అన్నారు. ‘ఇతరులను ప్రోత్సహించేందుకు ఈ పని చేస్తున్నాను.. మతసామరస్యాన్ని చాటేందుకు వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కులాలు, మతాల పేరుతో ఘర్షణకు దిగి మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్న ఈ సమాజంలో కరీం సాబ్ చేసిన మంచి సందేశాన్ని పంపింది. ముఖ్యంగా కవితల పట్టణంలో హిందువులు, ముస్లింల మధ్య సామరస్య సందేశాన్ని అందించింది.
ఇక, శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో ఏటా నవంబరు 17 నుంచి జనవరి 20 వరకూ మండల-మకర విలక్కు పూజలు రెండు నెలల పాటు జరుగుతాయి. ఈ సీజన్లో లక్షలాది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. దక్షిణ భారతంతో పాటు దేశం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తారు. 41 రోజుల పాటు మాలను ధరించి, ఇరుముడి కట్టుకుని శబరియాత్ర చేస్తారు. తలపై ఇరుముడితో శబరిగిరికి చేరుకుని, పదునెట్టాంబడి మీదుగా సన్నిధానంలోని అయ్యప్పను దర్శించుకుంటారు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో దర్శనం కోసం 18 నుంచి 24 గంటల వరకూ క్యూలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa