ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సముద్రం అడుగున దాక్కున్నా వదిలిపెట్టం.. నౌకల దాడులపై రాజ్‌నాథ్ వార్నింగ్

national |  Suryaa Desk  | Published : Tue, Dec 26, 2023, 10:33 PM

భారత్‌కు వస్తోన్న వాణిజ్య నౌకలపై ఇటీవల జరుగుతోన్న దాడుల విషయంలో కేంద్రం తీవ్రంగా స్పందించింది. నౌకలపై వరుస దాడుల నేపథ్యంలో సముద్ర జలాల్లో గస్తీని ముమ్మరం చేసినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ దాడులకు పాల్పడిన వారు ఎక్కడ దాక్కున్నా సముద్రం అడుగున ఉన్నా వేటాడి, పట్టుకుంటామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విశాఖపట్నం తరగతి యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌’ను ముంబయిలో జలప్రవేశం చేయించిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘నౌకాదళం నిఘా పెంచింది... ఈ దాడులకు పాల్పడినవారిని సముద్రగర్భంలో ఉన్నా కూడా కనిపెడతాం. దీని వెనుక ఉన్న వారిని న్యాయస్థానం ముందుంచుతాం’ అని రాజ్‌నాథ్ ఉద్ఘాటించారు. మొత్తం హిందూ మహాసముద్ర ప్రాంతానికి భద్రతగా ఉన్న భారత్.. స్నేహపూర్వక దేశాలతో కలిసి పని చేస్తుంది అన్నారు. ఈ ప్రాంతంలో సముద్ర వాణిజ్యం భద్రతను నిర్ధారిస్తుందని నొక్కి చెప్పారు. కాగా, అరేబియా సముద్రంలో గుజరాత్ తీరానికి సమీపంలోని పోరుబందర్‌కు 227 నాటికళ్ల మైళ్ల దూరంలో వాణిజ్య నౌక ‘ఎంవీ కెమ్‌ ప్లూటో’పై డిసెంబర్‌ 23న డ్రోన్‌ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన భారత నౌకాదళం తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. ‘ఐసీజీఎస్‌ విక్రమ్‌’ గస్తీలో ఆ వాణిజ్య నౌక ముంబయి పోర్టు ప్రాంతానికి చేరుకుంది.


ఈ దాడి ఇరాన్‌ భూభాగంపై నుంచే జరిగిందని అమెరికా రక్షణశాఖకు చెందిన పెంటగాన్‌ ప్రకటించింది. ఇజ్రాయేల్-గాజా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఎర్ర సముద్రంలోని నౌకలను లక్ష్యంగా చేసుకున్న యెమెన్‌లో ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ఈ దాడికి పాల్పడినట్టు పెంటగాన్ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, ఈ ఆరోపణను ఇరాన్‌ ఖండించింది. అంతకుముందు ‘ఎంవీ సాయిబాబా’పైనా దాడి జరిగింది. ఈ పరిణామాల నడుమ భారత హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa