ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.200 కోట్లు దాటిన శబరిమల ఆదాయం.. 39 రోజుల్లో 31 లక్షల మందికి అయ్యప్ప దర్శనం

national |  Suryaa Desk  | Published : Tue, Dec 26, 2023, 10:35 PM

కేరళలో అయ్యప్ప నెలవైన శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి శబరిగిరులు మొత్తం అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. అంచనాలకు మించి వస్తున్న భక్తులతో అక్కడి పోలీసులు, దేవస్థానం అధికారులు కూడా వారిని నియంత్రించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన వారితో శబరిమల ఆదాయం రూ.200 కోట్లు దాటింది. 39 రోజుల క్రితం ప్రారంభమైన అయ్యప్ప దర్శనాల్లో భాగంగా ఇప్పటివరకు 31 లక్షల మంది శబరిమల అయ్యప్పను దర్శించుకున్నట్లు ఆలయ బోర్డు వెల్లడించింది.


ఈసారి మండల విరక్కు సందర్భంగా అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో శ‌బ‌రిమ‌ల ఆలయ ఆదాయం రూ. 200 కోట్లు దాటినట్లు ఆలయ వ్యవహారాలు చూసుకునే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తాజాగా వెల్లడించారు. గ‌త 39 రోజుల్లో రూ.204.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపింది. ఇందులో కానుకల రూపంలో రూ. 63.89 కోట్లు రాగా.. అర‌వ‌న ప్ర‌సాదం ద్వారా రూ. 96.32 కోట్ల ఆదాయం ఆలయానికి వ‌చ్చిందని తెలిపింది. అయితే కానుక‌ల రూపంలో వ‌చ్చిన ఆదాయం లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధ్య‌క్షుడు పీఎస్ ప్ర‌శాంత్ వెల్లడించారు. అయితే లెక్కింపు ఇంకా కొనసాగుతోందని.. అది పూర్తయితే ఆదాయం మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపారు. ఇక అప్పం ప్ర‌సాదం ద్వారా రూ. 12.38 కోట్లు వ‌చ్చిన‌ట్లు ప్ర‌శాంత్ తెలిపారు.


ఇక ఈ మండ‌ల విరక్కు పూజ కాలంలో డిసెంబర్ 25 వ తేదీ నాటికి 39 రోజుల్లో 31,43,163 మంది భ‌క్తులు అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకున్నట్లు ట్రావెన్ కోర్ బోర్డు వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 1.12 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారని తెలిపింది. ఇక ఇప్పటివరకు 7,25,049 మందికి ఉచిత భోజ‌నం పెట్టినట్లు తెలిపారు. ఇక బుధ‌వారం రాత్రి 11 గంటలకు ఆల‌యాన్ని మూసివేయ‌నున్నట్లు ట్రావెన్ కోర్ బోర్డు తెలిపింది. ఆ తర్వాత మ‌క‌ర‌విల‌క్కు పండుగ కోసం మ‌ళ్లీ డిసెంబ‌ర్ 30 వ తేదీన శబరిమల ఆల‌యాన్ని తెర‌వ‌నున్నట్లు స్పష్టం చేసింది. ఇక జ‌న‌వ‌రి 15 వ తేదీ మకర జ్యోతి పూర్తయ్యే వరకు ఆల‌యాన్ని తెరిచి ఉంచనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు.. రోజురోజుకూ శబరిమలలో భక్తుల రద్దీ పెరుగుతుండటంతో కేరళ హైకోర్టు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం, ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు తాగు నీరు సహా ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కేరళ డీజీపీని ఆదేశించింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa