జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, ఎంపీ ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలకు తెరతీశారు. మన దాయాది దేశమైన పాకిస్థాన్తో చర్చలు జరపకపోవడంపై కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా భారత్ ఎందుకు పాక్తో చర్చలు జరపడం లేదని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. భారత్, పాక్ మధ్య రగులుతున్న వివాదంతో భవిష్యత్లో గాజా, పాలస్తినాకు ఎదురైన పరిస్థితే మనకూ వస్తుందని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ సందర్భంగా గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేసిన వ్యాఖ్యలను ఫరూక్ అబ్దుల్లా గుర్తు చేశారు. మిత్రులను మార్చుకోగలం కానీ పొరుగువారిని మార్చుకోలేం అంటూ అటల్ బిహారీ వాజ్పేయి తరచూ చెప్పేవారని తెలిపారు. పొరుగువారితో మనం స్నేహంతో ఉంటే ఇద్దరూ ప్రగతి సాధించవచ్చని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. యుద్ధం ఒక్కటే మార్గం కాదని.. చర్చలు ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నారన్న ఫరూక్ అబ్దుల్లా.. మరి ఆ చర్చలు ఎక్కడ అంటూ ప్రశ్నించారు.
ఇక పాకిస్థాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ పగ్గాలు చేపడుతున్న తరుణంలో కూడా భారత్తో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. కానీ భారత్ చర్చలు జరపకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. చర్చల ద్వారా మనం పరిష్కారం కనుగొనలేకపోతే గాజా, పాలస్తీనాకు పట్టిన గతే మనకూ ఎదురుకావచ్చని ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక భారత్ పాక్ సమస్యపై ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై అధికార బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. భారత్ పాక్ చర్చల గురించి జమ్మూ కాశ్మీర్కు చెందిన ఓ సీనియర్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమని.. బీజేపీ సీనియర్ నేత డాక్టర్ హీనా షఫీ భట్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత్.. పాకిస్తాన్ ముందు తలవంచదని.. చర్చలకు భారత్ ప్రయత్నించినా.. పాకిస్థాన్.. పదే పదే దాడులు చేస్తోందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa