భారత్, పాక్ సరిహద్దుల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. భారత సైన్యం లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ఆర్మీపై దాడులు చేస్తున్న ఉగ్రవాదులు చైనా తయారీ పరికరాలను వాడుతున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఇవి చైనా నుంచి పాకిస్థాన్ సైన్యానికి చేరగా.. అక్కడి నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్కు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు చైనా నుంచి సాయం అందుతున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి.
అయితే ఇప్పటివరకు పాక్ ఉగ్రవాదులు అమెరికా తయారు చేసిన ఎం 4 రైఫిళ్లను మాత్రమే వాడినట్లు గుర్తించారు. అయితే ఇటీవల సరిహద్దుల్లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, బాడీసూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. వీటితోపాటు చైనా నుంచి డ్రోన్లు, హ్యాండ్ గ్రనేడ్లు, ఇతర ఆయుధాలు కూడా చైనా నుంచి పాక్ సైన్యానికి చేరుతున్నాయని భద్రతా బలగాలు తేల్చారు. ఈ ఏడాది జమ్మూలో జరిగిన ఉగ్రదాడుల్లో కూడా ఈ మేడిన్ చైనా ఆయుధాలు వాడినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
చైనా టెక్నాలజీతో తయారు చేసిన స్నైపర్ గన్స్ను ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నట్లు భద్రతా వర్గాలు గుర్తించాయి. గత నవంబర్లో సరిహద్దుల్లో చొరబాట్లకు ప్రయత్నిస్తున్న సమయంలో పాక్ నుంచి స్నైపర్ కాల్పులు జరపగా.. ఈ ఏడాది జరిగిన 3 భారీ ఉగ్రదాడుల్లో కూడా ఉగ్రవాదులు చైనా తయారు చేసిన బాడీ సూట్ కెమెరాలను ఉపయోగించినట్లు తేలింది. చైనా టెక్నాలజీతో పనిచేసే ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా ఉగ్రవాదుల వద్ద ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ధృవీకరించాయి. చైనా నుంచి పాకిస్థాన్కు ఎప్పటికప్పుడు ఆయుధాలు, కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలు అందుతూనే ఉన్నాయని.. వాటిని పాక్ సైన్యం ఉపయోగించకుండా.. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్ర సంస్థలకు అందిస్తోందని గుర్తించారు. ఇవే కాకుండా పాక్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ వ్యవస్థను బలోపేతం చేసే పనిని కూడా చైనా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. సైబర్ వార్ఫేర్ నిమిత్తం ఇప్పటికే పాకిస్థాన్లో ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు కూడా చైనా నిధులను సమకూర్చిందని పేర్కొన్నాయి.
ఈ క్రమంలోనే ఇటీవల పూంఛ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడి అనంతరం అక్కడికి ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే చేరుకుని పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. ఉగ్రవాదం విషయంలో ఎలాంటివి ఉపేక్షించవద్దని స్థానిక కమాండర్లకు ఆర్మీ చీఫ్ ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రవాదులు దాక్కొని ఉన్న గుహలను ధ్వంసం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రాజౌరీ-పూంఛ్ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇటీవల దాడి జరిగిన డేరా కి గలీ, బుఫ్లియాజ్ ప్రాంతాలపై భారత సైన్యం ముఖ్యంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే అక్కడ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa