ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 16న తిరుమల శ్రీవారి పార్వేట ఉత్సవం,,,,ఆ రోజు ఆర్జిత సేవలు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 06:58 PM

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం జనవరి 16 వతేదీ ఘనంగా జరగనుంది. అదే రోజున గోదాపరిణయోత్సవం నిర్వహిస్తారు. గోదాపరిణయోత్సవం సంద‌ర్భంగా ఉద‌యం 9 గంట‌ల‌కు ఆండాళ్ అమ్మ‌వారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయర్ మ‌ఠం నుంచి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకు వెళ్లి స్వామివారికి స‌మ‌ర్పిస్తారు. అనంత‌రం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంత‌రం స్వామివారు ఆల‌యానికి చేరుకుంటారు. ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.


సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుప‌తి శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో జనవరి 14న భోగితేరు, జ‌న‌వ‌రి 15న మకరసంక్రాంతి ప‌ర్వ‌దినాలు జరుగనున్నాయి. జనవరి 14న భోగి పండుగ రోజున సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహిస్తారు. జనవరి 15న మకర సంక్రాంతి సంద‌‌ర్భంగా ఉదయం సంక్రాంతి తిరుమంజనం చేపడతారు. ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఆల‌యం నుండి చ‌క్ర‌త్తాళ్వార్‌ను ఊరేగింపుగా క‌పిల‌తీర్థంలోని శ్రీ ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేస్తారు. అక్క‌డ చ‌క్ర‌స్నానం అనంత‌రం ఆస్థానం చేప‌డ‌తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజస్వామివారు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు.


జనవరి 16న ఉద‌యం శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి మేల్‌ఛాట్ వ‌స్త్రం, పూల‌మాల ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ ఆండాళ్ అమ్మ‌వారికి స‌మ‌ర్పిస్తారు. శ్రీ ఆండాళ్ అమ్మ‌వారిని క‌పిల‌తీర్థంలోని శ్రీ ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేస్తారు. అక్క‌డ ఏకాంతంగా తిరుమంజ‌నం అనంత‌రం తిరిగి ఆల‌యానికి చేరుకుంటారు. ఆల‌యంలో సాయంత్రం 4 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ గోదాక‌ల్యాణం వేడుకగా నిర్వ‌హిస్తారు. అదేవిధంగా, జ‌న‌వ‌రి 17న పార్వేట ఉత్స‌వం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌యం నుండి రేణిగుంట రోడ్డులోని పార్వేట‌మండ‌పానికి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారిని వేంచేపు చేస్తారు. అక్క‌డ ఆస్థానం అనంత‌రం తిరిగి ఆల‌యానికి చేరుకుంటారు.


తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్‌ నీరాటోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. 13వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు ఊరేగింపుగా బయల్దేరి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ మాడ వీధులు, చిన్నబజారు వీధి, శ్రీకోదండరామాలయం మాడ వీధుల గుండా రామచంద్ర కట్టపై గల నీరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి అభిషేకం, ఆస్థానం చేపట్టారు. ఆండాళ్‌ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీ ఆండాళ్‌ అమ్మవారు శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకున్నారు. ఈ విధంగా ఏడు రోజుల పాటు ఈ ఉత్సవం సాగుతుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa