చంద్రబాబు మోసగాడని ప్రంపంచం మొత్తానికి తెలుసు కానీ.. ఇంత పచ్చి మోసగాడని, దగా చేస్తాడని, కుటుంబాల మధ్య చిచ్చు పెడతాడని తెలియదంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేశినేని కీలక కామెంట్లు చేశారు. టీడీపీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించానని తెలిపిన కేశినేని.. రాజీనామా ఆమోదం పొందగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. చంద్రబాబు పచ్చి మోసగాడు, జగన్ ప్రజాపక్షపాతిగా అభివర్ణించిన నాని.. ఇప్పుడు జగన్తో ప్రయాణం చేయాలనుకుంటున్నట్టు వివరించారు.
టీడీపీ కోసం, ప్రజల కోసం చాలా నిజాయితీగా కష్టపడ్డానని కేశినేని నాని తెలిపారు. తన సొంత వ్యాపారాల కంటే.. పార్టీనే ముఖ్యమని అనుకున్నట్టు వివరించారు. పార్టీ కోసం సొంత ఆస్తులు అమ్ముకున్నానని.. వ్యాపారాలు కూడా వదిలేశానన్నారు. తాను అమ్ముకున్న ఆస్తుల విలువ రెండు వేల కోట్లుగా పేర్కొన్నారు. బాబు పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలను తన భుజాల మీద మోసినట్టు చెప్పుకొచ్చారు. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యునితో ప్రెస్ మీట్ పెట్టించి తనను తిట్టించారన్నారు. గొట్టం గాడు అన్న భరించానన్నారు. చెప్పుతొ కొడతానని ఓ క్యారెక్టర్ లెస్ వ్యక్తి అన్నాడన్నారు. తనను ఎవరు ఎన్ని మాటలు అన్నా పార్టీ నుంచి మాత్రం ఎలాంటి మద్దతు రాలేదని చెప్పారు.
నన్ను చాలా రకాలుగా అవమానించారని.. తన కుటుంబంలో చిచ్చు పెట్టారని కేశినేని నాని చెప్పుకొచ్చారు. తనను తన కుటుంబ సభ్యులతోనే కొట్టించాలని లోకేష్ ఎందుకు చూశారని కేశినేని ప్రశ్నించారు. తాను పార్టీలో ఉండటం ఇష్టంలేదంటే చెప్పండి వెళ్లిపోతా అని ఆరోజే చంద్రబాబును అడిగానని.. కానీ నువ్వు ఉండాల్సిందే అని చెప్పినట్టుగా పేర్కొన్నారు. టీడీపీలోనే ఉంటూ ఇంకా ఎన్ని అవమానాలు భరించాలన్నారు. ఇన్ని రోజులు ఎంత మంది చెప్పినా కూడా టీపీడీలోనే కొనసాగానని.. ఇక తనను ఇంతా అవమానించిన వారితో కలిసి పని చేయలేనని బయటకు వచ్చేస్తున్నట్టు వివరించారు.
విజయవాడ అంటే నాకు ప్రాణం.. ఏమైనా చేస్తానని కేశినేని నాని తెలిపారు. విజయవాడ కోసం ఇప్పటికే చాలా చేశా.. ఇంకా చేస్తానని తెలిపారు. పాజహాన్ తాజ్ మహల్ కట్టాడు.. తాను అమరావతి కట్టాను అని చంద్రబాబు చెప్పుకుంటారని, కానీ విజయవాడ రియాలిటీ.. అమరావతి ఓ కల అంటూ నాని తెలిపారు. తన విషయంలో టీడీపీ ప్రోటోకాల్ విస్మరించిందని ఆరోపించారు. ఎంపీగా తాను సీఎం కార్యక్రమాలకు హాజరు కావాలని.. కానీ తనను చంద్రబాబు హాజరుకానివ్వలేదని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60 శాతం ఖాళీ కాబోతోందని తెలిపారు. తాను అప్పట్లో చంద్రబాబును టికెట్ అడగలేదని.. ఇప్పుడు జగన్ను కూడా టికెట్ అడగనని తెలిపారు. జగన్ ఏం చేయమంటే అది చేస్తానని కేశినేని నాని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa