ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలా రెడ్డి.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకొని షాకివ్వగా, తాజాగా మరో సోదరి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతా రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. అంతేకాదు, కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే యోచనలోనూ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఘటన తర్వాత ఆమె కుమార్తె సునీతా రెడ్డి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. న్యాయం కోసం తన గొంతు వినిపిస్తూ సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐకి కీలక సమాచారం ఇచ్చారు. కోర్టుల్లో కేసుల్లో సైతం సునీత ఇంప్లీడ్ అయ్యారు. తన తండ్రిని హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడాలని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మరో అడుగు ముందుకేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. ఏపీ కాంగ్రెస్లో ఉత్సాహాన్ని నింపింది. ఇదే సమయంలో వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి మరింత జోష్ వచ్చింది. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలందరూ తిరిగి యాక్టివ్ అవుతున్నారు. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్నవారు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రానున్న రోజుల్లో పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన సమయంలో సునీతా రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఆయన చెల్లెళ్లిద్దరూ కలిసి పనిచేయనుండటం ఏపీ రాజకీయాలను మరింత రసకందాయంలో పడేసింది. ఇప్పుడు వైఎస్ విజయమ్మ ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది మరో ఆసక్తికర చర్చకు తావిస్తోంది..!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa