ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య బాలరాముడి ఆభరణాల గురించి తెలుసా.. పరిశోధన, అధ్యయనం తర్వాత తయారీ

national |  Suryaa Desk  | Published : Tue, Jan 23, 2024, 10:02 PM

 5 శతాబ్దాలుగా కలలు గన్న అయోధ్య రామ మందిరంలో కొలువుదీరనున్న రాముడి విగ్రహం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠకు తెరపడింది. 5 ఏళ్ల వయసు ఉన్న బాలుడి రూపంలో ఉన్న రామ్ లల్లాకు అయోధ్య గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అయితే ఆ రామ్ లల్లాకు భారీగా ఆభరణాలను అలంకరించారు. ఆ బాల రాముడికి అలంకరించిన ఆభరణాల వెనుక చాలా స్టోరీ ఉంది. ఎంతో పరిశోధన చేసి అధ్యయనాలు జరిపి ఆ ఆభరణాలను తయారు చేయించారు. అయోధ్యలో ఏర్పాటు చేయనున్న రాముడి విగ్రహానికి ఎలాంటి ఆభరణాలు తయారు చేయించాలనే విషయంపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చాలా కసరత్తు చేసింది.


ఆధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణం, రామచరిత మానస్‌, అలవందర్‌ స్తోత్రాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఆ తర్వాతే బాల రాముడికి అలంకరించే ఆభరణాలను తయారు చేయించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలోని అంకుర్‌ ఆనంద్‌కు చెందిన హర్‌సాహైమల్‌ షియాంలాల్‌ జువెలర్స్‌ వారు ఆ ఆభరణాలను డిజైన్‌ చేశారు. ముందుగా రామ్‌లల్లాను బనారసీ వస్త్రంతో అలంకరించారు. పసుపు పచ్చ పంచెతోపాటు ఎరుపు రంగు అంగవస్త్రాన్ని ధరింపజేశారు. ఈ అంగవస్త్రాలను బంగారు వర్ణపు జరీతో తయారు చేశారు. దానిపై శంఖం, చక్రం, పద్మం, మయూర్‌లను ముద్రించారు. ఈ వస్త్రాలను ఢిల్లీకి చెందిన డిజైనర్‌ మనీశ్‌ త్రిపాఠి స్వయంగా అయోధ్యలో ఉండి రూపొందించారు.


ఇక అయోధ్య రామ్‌లల్లా విగ్రహానికి అమర్చిన బంగారు కిరీటం విలువ రూ.11 కోట్లు అని ఆలయ వర్గాలు తెలిపాయి. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన పారిశ్రామికవేత్త, గ్రీన్‌ల్యాబ్‌ డైమండ్స్‌ అధినేత ముకేశ్‌ పటేల్‌ ఈ కిరీటాన్ని అందించారు. 6 కిలోల బరువు ఉన్న ఈ కిరీటంలో అత్యంత విలువైన రాళ్లను పొదిగారు. 4.5 కేజీల బంగారంతోపాటు చిన్నా పెద్దా వజ్రాలు, కెంపులు, ముత్యాలు, నీలమణులతో తయారు చేశారు. సూరత్‌కు చెందిన కుషాల్‌దాస్‌ జువెలర్స్‌ యజమాని దీపక్‌ చోక్సీ.. ఒక్కోటి 3 కిలోల బరువున్న వెండి రామ మందిర నమూనాలను అందజేశారు.


ముకుట్ అని పిలిచే రాముడి కిరీటాన్ని 1.7 కిలోల బంగారంతో తయారు చేశారు. మరో అర కిలో బంగారంతో కిరీటం వెనక చుట్టు ఉండే వెలుగు లాంటి హాలోను రూపొందించారు. కిరీటంలో 75 క్యారెట్ల వజ్రాలు, 135 క్యారెట్ల జాంబియన్ పచ్చలు, 262 క్యారెట్ల కెంపులు ఉంచారు. ఆ ముకుట్ మధ్యలో ఉన్న సూర్యుడు.. శ్రీరాముడి వంశమైన సూర్యవంశీ లోగోను సూచిస్తుంది. ఇక సుమారు 16 గ్రాములు ఉండే తిలకాన్ని రాముడికి అలంకరించారు. ఇందులో 3 క్యారెట్ల సహజ వజ్రం, దాని చుట్టూ దాదాపు 10 క్యారెట్లు ఉండే చిన్న వజ్రాలు ఉంచారు. ఇక ఉంగరాల విషయానికి వస్తే కుడి చేతి ఉంగరానికి 4 క్యారెట్ల వజ్రాలు, 33 క్యారెట్ల పచ్చ, బంగారంతో 65 గ్రాములతో తయారు చేశారు. ఎడమ చేతి కోసం 26 గ్రాముల రూబీ రింగ్‌లతో వజ్రాలు, కెంపులు పొదిగి రూపొందించారు.


బంగారంతో చేసిన చిన్న గుండ్రని నెక్లెస్ 500 గ్రాముల బరువు ఉంది. ఇందులో 50 క్యారెట్ల వజ్రాలు, 150 క్యారెట్ల కెంపులు, 380 క్యారెట్ల పచ్చలు పొదిగారు. ఇక సుమారు 750 గ్రాముల బరువైన బంగారు నడుము పట్టీలో 70 క్యారెట్ల వజ్రాలు, 850 క్యారెట్ల కెంపులు, పచ్చలు పొదిగారు. 850 గ్రాముల బరువైన చేతి కడియాలను 22 క్యారెట్ల బంగారంతో చేశారు. దాదాపు 100 క్యారెట్ల వజ్రాలు, 320 క్యారెట్ల కెంపులు, పచ్చలు వీటిలో పొదిగారు. బంగారం, వజ్రాలు, కెంపులు పొదిగిన కడియాలను సుమారు 400 గ్రాముల బరువుతో తయారు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa