ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న కరెన్సీ కట్టలు,,,,తాజాగా కర్నూలు జిల్లాలో డబ్బులు సీజ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 27, 2024, 07:05 PM

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కరెన్సీ కట్టలు బయటపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భారీగా డబ్బులు పట్టుబడుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో భారీగా డబ్బులు దొరికాయి. కృష్ణగిరి మండల పరిధిలోని 44నెంబరు నేషనల్ హైవేపై అమకతాడు టోల్‌ప్లాజా సమీపంలో భారీగా డబ్బుల్ని స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా శుక్రవారం సాయంత్రం వాహన తనిఖీలు చేస్తున్నారు.


ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో తనిఖీలు చేపట్టారు. అందులో అనంతపురానికి చెందిన ఎర్రగుడి సాయిప్రదీప్‌ రెడ్డికి చెందిన బ్యాగులో రూ.43.20 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. వాటికి ఎలాంటి పత్రాలు చూపలేదన్నారు. ఆ మొత్తాన్ని కృష్ణగిరి రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి, స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.


మరోవైపు ఆదోనిలో ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న వెండి వస్తువులు, డబ్బుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోసిగి మండలం దొడ్డి బెళగల్‌కు చెందిన కటికె మీర్‌ మహమ్మద్‌ ఇస్మాయిల్‌ పెద్ద మొత్తంలో వెండి సామగ్రి, నగదు తీసుకెళ్తున్నారని పక్కా సమాచారంతో దాడులు చేసి పట్టుకున్నామన్నారు. ఆ యువకుడి వద్ద వెండి, నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో యువకుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పంచనామా నిర్వహించి రూ.4.50 లక్షల నగదు, 3.02 కిలోల వెండి సామగ్రిని సీజ్‌ చేశామన్నారు.


ఇటు అనంతపురం జిల్లాలో కూడా డబ్బులు దొరికాయి. పావగడ రహదారిలోని చెక్‌పోస్టు దగ్గర శెట్టూరు పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో బెంగళూరు నుంచి వయా పావగడ, కంబదూరు మీదుగా అనంతపురం వైపుగా ఓ కారు వచ్చింది. అనుమానంతో దానిని తనిఖీ చేయగా రూ.10 లక్షల నగదు దొరికింది. ఆ నగదును బెంగళూరు వ్యాపారి గయాజుద్దీన్‌కి చెందిన శిరాజుద్దీన్‌, మహమ్మఇద్రీస్‌, రియాజ్‌ తరలిస్తున్నారు. ఆ నగదుకు సంబంధించిన పత్రాలు వారి వద్ద లేవు. కూడేరులో దానిమ్మతోట కొన్నామని, దానికి చెల్లించడానికి నగదును తరలిస్తున్నామని వారు చెప్పారు. పట్టుకున్న నగదును జప్తు చేసి ఐటీ అధికారులకు బ్యాంకు ద్వారా అప్పజెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల చిత్తూరు, ఉమ్మడి కృష్ణా, విశాఖతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో డబ్బులు భారీగా పోలీసులకు దొరికాయి. ఒకవేళ ఎవరైనా డబ్బుల్ని తీసుకెళుతుంటే కచ్చితంగా వాటికి సంబంధించిని డాక్యుమెంట్లను వెంట ఉంచుకోవాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ సరైన పత్రాలు చూపించలేకపోతే.. ఆ డబ్బుల్ని సీజ్ చేస్తాము అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa