ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిమాండ్లకు సర్కారు అంగీకారం.. ఆమరణ దీక్ష విరమించిన మరాఠా ఉద్యమ నేత

national |  Suryaa Desk  | Published : Sat, Jan 27, 2024, 11:15 PM

తమను ఓబీసీలుగా గుర్తించి, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పించాలనే డిమాండ్‌తో ఆమరణ దీక్షకు దిగిన మరాఠా ఉద్యమ నేత మనోజ్ జరంగే పాటిల్ శనివారం తన నిరసనను విరమించారు. అన్ని డిమాండ్లను మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో జరంగే పాటిల్ తన దీక్షను విరమించినట్టు ప్రకటించారు. ముంబయిలో శుక్రవారం నుంచి పాటిల్ నిరాహార దీక్షకు దిగారు. ఓబీసీ కేటగిరీ కింద తమకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని మరాఠాలు గత కొన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. మరాఠాలందరికీ కుంబీ సర్టిఫికెట్లు, కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో మరాఠాలకు రిజర్వేషన్లు పాటిల్ డిమాండ్లలో ఉన్నాయి.


ఇప్పటి వరకు 37 లక్షల కుంబీ సర్టిఫికెట్లు ఇచ్చామని, వాటి సంఖ్య 50 లక్షలకు చేరుకుంటుందని పాటిల్ తెలిపారు. కుంబీ అనేది ఇతర వెనుకబడిన తరగతులను సూచిస్తుంది. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ముంబయిలోని ఆజాద్ మైదాన్‌కు పెద్దఎత్తున తరలివచ్చి నిరసన తెలుపుతామని పాటిల్ ప్రకటించాడు. ‘ప్రభుత్వం మా డిమాండ్లను అంగీకరించకపోతే మేము ఏమి చేయగలమో చేసి చూపుతాం’ అని పాటిల్ హెచ్చరించాడు. దీంతో మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే సర్కారు అప్రమత్తమయ్యింది. శుక్రవారం రాత్రి జరంగే పాటిల్‌ను మహారాష్ట్ర మంత్రులు ఇద్దరు కలిసి, ప్రభుత్వం అన్ని డిమాండ్లను అంగీకరించిందని చెప్పారని ఆందోళనకారులు తెలిపారు. సీఎం ఏక్‌నాథ్ షిండే సైతం దీక్షా స్థలికి చేరుకుని సంప్రదింపులు జరిపి.. ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించడంతో వాసాయ్‌లో ఆదివారం భారీ విజయోత్సవ సభను నిర్వహించాలని నిర్ణయించారు. మరాఠా సామాజికవర్గం రిజర్వేషన్ల డిమాండ్ ఆ సంఘం నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య చర్చలకు కేంద్ర బిందువుగా మారింది.


కాగా, గతంలో మరాఠాలకు రిజర్వేషన్ల కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని మే 5, 2021న సుప్రీంకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే నిబంధనను ఉల్లంఘించడానికి సరైన కారణం లేదని పేర్కొంది. కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, ఉద్యోగాలలో మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్‌లను రద్దుచేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa