తమ ప్రభుత్వాన్ని కూల్చేవేయడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఆఫర్ చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చలు జరుపుతోందని, ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రిని త్వరలో అరెస్టు చేస్తామని బెదిరించిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వ్యూహరచన చేస్తోందని ఈ మేరకు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
‘ఢిల్లీలో ఆప్కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలతో బీజేపీ ఇటీవల సంప్రదింపులు జరిపింది.. కొద్ది రోజుల్లో కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తామని,.. తర్వాత ఎమ్మెల్యేలను చీల్చి తమవైపు తిప్పుకుంటామని చెప్పారు.. ఇప్పటికే 21 మంది ఆప్ శాసనసభ్యులతో మాట్లాడాం.. మరికొంత మందితోనూ టచ్లో ఉన్నాం.. అనంతరం ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తాం.. మీరు కూడా మా వెంట రావాలి.. రూ.25 కోట్లు ఇస్తాం.. బీజేపీ టిక్కెట్పై పోటీ చేయాల్సి ఉంటుంది’ అని చెప్పినట్టు కేజ్రీవాల్ ఆరోపించారు.
21 మంది ఎమ్మెల్యేలను సంప్రదించినట్లు ప్రచారం జరగుతున్నప్పటికీ.. కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలను మాత్రమే సంప్రదించారని ఆప్కి అందుబాటులో ఉన్న సమాచారం సూచిస్తోందని, వారందరూ వారి ఆఫర్ను గట్టిగా తిరస్కరించారని కేజ్రీవాల్ చెప్పారు. ‘మద్యం కుంభకోణంలో నన్ను అరెస్టు చేయలేక ఢిల్లీలోని మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది.. కానీ వారి ప్రయత్నాలు ఏ మాత్రం సఫలం కావు.. దేవుడు, ప్రజలు ఎల్లప్పుడూ మాకు మద్దతుగా ఉంటారు. మా ఎమ్మెల్యేలంతా కూడా గట్టిగానే కలిసి ఉన్నారు.. ఈసారి కూడా ఈ వ్యక్తులు తమ దుర్మార్గపు కుట్రల్లో విఫలమవుతారు’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
ఆప్ చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రజలు ఆప్ పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉన్నారని, ఎన్నికల్లో బీజేపీని ఓడించారని అన్నారు. అయితే, గతంలోనూ కేజ్రీవాల్ ఇటువంటి ఆరోపణలు చేయడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa