వైఎస్సార్సీపీ నుంచి సస్పెండైన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఫిబ్రవరి 8న విచారణకు రావాలని వారికి మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 5లోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలి అని నోటీసులో స్పష్టం చేశారు. ఇవాళ ఆ నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపనున్నారు. మరోసారి ఎమ్మెల్యేల వివరణ తీసుకోనున్నారు.. ఆ తర్వాత ఎమ్మెల్యేల అనర్హత పై తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు స్పీకర్ తమినేని. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై వైఎస్సార్సీపీ అనర్హత పిటిషన్ దాఖలుచేయడంతో.. ఈ నెల 29న విచారణకు రావాలని ఇటీవల స్పీకర్ కార్యాలయం వారికి నోటీసులు పంపింది. వారు నాలుగు వారాల గడువు కోరినా, కుదరదని స్పీకర్ కార్యాలయం స్పష్టం చేయడంతో... వారంతా సోమవారం విచారణకు హాజరయ్యారు.
ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు కావాలని విచారణ సందర్భంగా వారు స్పీకర్ని మళ్లీ కోరారు. కానీ స్పీకర్ మాత్రం ఒప్పుకోలేదు.. మూడు వాయిదాలకే నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ తమకు చెప్పినట్టు వారు తెలిపారు. వారు మళ్లీ విచారణకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇస్తోంది. టీడీపీ నుంచి గెలిసి వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు కరణం బలరామకృష్ణమూర్తి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్కుమార్, మద్దాళి గిరిధర్లపై టీడీపీ అనర్హత పిటిషన్ ఇచ్చింది. వారికి కూడా స్పీకర్ ఇటీవల నోటీసులు జారీచేశారు. వారినీ సోమవారం విచారణకు పిలవగా... గణేష్కుమార్ మాత్రమే హాజరయ్యారు. ఈ నలుగురిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది చూడాలి.
మరోవైపు వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. తమ వాదనను వినిపించడానికి నాలుగు వారాల సమయం కావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోరారు. స్పీకర్ జారీచేసిన నోటీసులపై ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ దశలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa