గుంటూరులో డయోరియా కలకలం రేగుతోంది. అతిసారం లక్షణాలతో ఓ యువతి ప్రాణాలు కోల్పోగా.. మరో 19 మంది అస్వస్థతతో ఆస్పత్రుల్లో చేరారు. తాగునీరు కలుషితం కావడం వల్లే డయోరియా బారినపడినట్టు తెలుస్తోంది. కలుషిత తాగునీరు సరఫరా అవుతుందని పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నా నగరపాలక సంస్థ యంత్రాంగం పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తోంది. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పలువురు ఆసుపత్రి పాలయ్యారు. శారదానగర్లో పద్మ అనే యువతి డయేరియా లక్షణాలతో మృతి చెందింది.
గుంటూరు నగరంలో శారదాకాలనీతోపాటు, శ్రీనగర్, సంగడిగుంట, నల్లచెరువు తదితర ప్రాంతాలకు చెందిన 19 మంది వాంతులు, విరోచనాలతో జీజీహెచ్, అర్బన్ హెల్త్ కేంద్రాల్లో చికిత్స కోసం చేరారు. నగరంలో పలుచోట్ల తాగునీటి పైపులైన్లు మురుగునీటి కాల్వలను క్రాస్ చేస్తూ వెళుతున్నాయి. ఈక్రమంలో పైపులైనుకు లీకేజీలు ఏర్పడి తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. కొన్నేళ్ల కిందట వేసిన పైపులైన్లతోపాటు ఎప్పటికప్పుడు అభివృద్ఢి పనుల పేరుతో తవ్వకాల కారణంగా తరచూ పైపులైన్లు మరమ్మతుకు గురవుతున్నాయి.
శారదాకాలనీలో రెండేళ్లుగా రహదారులు, మురుగుకాల్వల నిర్మాణం కోసం తవ్వకాలు చేస్తున్నారు. దీంతో తాగునీటి పైపులైన్లు పగిలిపోయి పలుచోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. కాలనీలోని రిజర్వాయర్ పక్కన 11వ లైన్లోనే లీకేజీ పడి పెద్దఎత్తున నీరు రహదారిపైకి చేరుతోంది. 14వ లైన్తోపాటు పలు కూడళ్ల వద్ద తాగునీటి కుళాయిఅు మురుగునీటి కాల్వల పక్కనే ఉన్నాయి. 17వ లైన్ వద్ద పగిలిన పైపులైను మరమ్మతు కోసొ గోతులు తవ్వి అలాగే వది లేశారు.
డయోరియా కలకలం రేగడంతో నగరపాలకసంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. కాలనీలో ఆశావర్కర్లు ఇంటింటి సర్వే చేసి వాంతులు, విరేచనాలు, ఇతర అనారోగ్య సమస్యలు గురించి ఆరా తీసి వివరాలు నమోదు చేశారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా కాల్వల్లో పూడికలు తీయించడంతోపాటు బ్లీచింగ్ చల్లించారు. కాల్వల్లో రసాయనాలు పిచికారీ చేయించారు. ఘటన జరిగిన తర్వాత అధికారుల స్పందించడంపై ప్రజలు మండిపడుతున్నారు. అనారోగ్యం పాలైతే కానీ పట్టించుకోరా? అని నిలదీస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa