భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో దేశంలోని తొలిదశలో నాలుగు నగరాలను ఆర్థిక పరివర్తన కోసం ఎంపిక చేసింది నీతీ ఆయోగ్. ఇందులో విశాఖపట్నం నగరానికి చోటుదక్కించుకుంది. విశాఖతో పాటు దేశ ఆర్థిక రాజధాని ముంబయి సూరత్, వారాణాసీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నగరాలకు ఆర్థిక ప్రణాళికను రూపొందించిన నీతి ఆయోగ్.. మరో 20-25 నగరాలకూ ఆర్థిక ప్రణాళికను రూపొందించాలని భావిస్తోంది.
ఈ మేరకు నీతీ ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం శనివారం ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు దోహదపడేలా ఈ నాలుగు నగరాల ఆర్థిక పరివర్తన కోసం ఒక ప్రణాళికను రూపొందించిందని ఆయన తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న మరో 20-25 నగరాలకు కూడా ఈ ప్రణాళికను రూపొందించాలని భావిస్తున్నట్టు చెప్పారు. అలాగే, 2047 నాటికి భారత్ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే విజన్ డాక్యుమెంట్నూ నీతీ ఆయోగ్ రూపొందిస్తోందని వివరించారు.
ఆ విజన్ డాక్యుమెంట్ను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేస్తారని పేర్కొన్నారు. ‘మేం నగరాల అర్బన్ ప్రణాళికలను మాత్రమే సిద్ధం చేసేవాళ్లం.. ఆర్థిక ప్రణాళికలను కాదు. విశాఖ, ముంబయి, సూరత్, వారాణాసి ఆర్థిక పరివర్తన కోసం ఆ నగరాల ఆర్థిక ప్రణాళికనూ రూపొందించాం.. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 11న యువత నుంచి అభిప్రాయాలు కోరింది.. ఇప్పటి వరకు యువత నుంచి 10 లక్షలకుపైగా వివరణాత్మక సూచనలు మాకు వచ్చాయి.. కృత్రిమ మేధను ఉపయోగించి వాటన్నింటినీ ప్రాసెసింగ్ చేస్తున్నాం’ అని బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని యూనివర్సిటీలు, విద్యా సంస్థల సహకారంతో రూపొందించామని తెలిపారు. వికసిత్ భారత్ 2047 కోసం గతేడాది 10 రంగాలను ఏకీకృతం చేసే పనిని నీతి-ఆయోగ్కు అప్పగించారు. ఇందులో ఆర్థికవృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ పరిరక్షణ సహా అభివృద్ధి వివిధ అంశాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa