ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీలోకి మరో వైసీపీ ఎంపీ?.. చంద్రబాబుతో భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 07:38 PM

ఆంధ్రప్రదే‌శ్‌లో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. వైఎస్సార్‌సీపీలో మార్పులు, చేర్పులు హీట్ పెంచుతున్నాయి. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు టికెట్లు దక్కకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు టీడీపీతో టచ్‌లోకి వెళ్లారు. అధికారికంగా పార్టీలో చేరకపోయినా.. బెర్త్ కన్ఫం చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఢిల్లీలో చంద్రబాబును కలిశారు. దీంతో టీడీపీలో చేరడం ఖాయమని.. నరసరావుపేట టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.


తాజాగా మరో ఎంపీ టీడీపీలోకి వెళతారనే ప్రచారం మొదలైంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈసారి టికెట్ లేదని అధిష్టానం తేల్చి చెప్పింది. అక్కడ పోటీ చేసే అభ్యర్థిని ఫైనల్ చేసే పనిలో ఉంది.. ఈ రేసులో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు రీజినల్ కో ఆర్డినేటర్ పదవి కూడా ఇచ్చారు. అయితే అధిష్టానం మాత్రం ఒంగోలు ఎంపీ సీటుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే వైఎస్సార్‌సీపీ నుంచి టికెట్ హామీ లేకపోవడంతో మాగుంట పార్టీ మారడం ఖాయమనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఎంపీ ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబును హైదరాబాద్‌లో కలుస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.


మాగుంట పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీ నుంచి రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారట. చంద్రబాబుతో సమావేశం అవుతారని.. ఆ తర్వాతే పార్టీ మార్పుపై క్లారిటీ వస్తుంది అంటున్నారు. మరోవైపు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ నెల 14వ తేదీ (బుధవారం) షెడ్యూల్ ప్రకటించారే కానీ.. మంగళవారం షెడ్యూల్ మాత్రం రాలేదు. దీంతో ఆయన మంగళవవారం హైదరాబాద్‌లో ఉంటారనే చర్చ జరుగుతోంది. చంద్రబాబుతో చర్చలు, సీటుపై హామీ తదితర అంశాలు తేలిన తర్వాత.. ఒంగోలు వెళ్లి అధికారికంగా టీడీపీలో చేరికపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.


మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి కూడా వైఎస్సార్‌సీపీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అయితే మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని పార్టీ పెద్దలు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. బాలినేని ఒకానొక సమయంలో మాగుంటకు సీటు ఇవ్వకపోతే తాను కూడా పోటీ చేయనని తెగేసి చెప్పారనే టాక్ వినిపించింది. అయినా సరే అధిష్టానం మాత్రం వెనక్కు తగ్గలేదు.. మాగుంటకు నో చెప్పేసినట్లు తెలుస్తోంది.


మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈసారి ఎంపీగా పోటీ చేస్తారా లేదా అన్నది క్లారిటీ లేదు. గతంలో తన కుమారుడు రాఘవరెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని శ్రీనివాసులరెడ్డి చెప్పారు. దీనికి తోడు కొద్ది రోజులుగా రాఘవరెడ్డి కూడా ఒంగోలు లోక్‌సభ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. దీంతో రాఘవరెడ్డి కూడా పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. మరి మాగుంట శ్రీనివాసులురెడ్డి పయనం ఎటు వైపు అన్నది త్వరలోనే తేలనుంది.


మాగుంట శ్రీనివాసులరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు.. 1998, 2004, 2009 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా కాంగ్రెస్‌ పార్టీ తరుపున గెలిచారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి.. ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడారు. మాగుంటకు 2015లో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల తరుపున ఎమ్మెల్సీగా పదవి దక్కింది. శ్రీనువాసులు రెడ్డి 2019 మార్చి 16న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయన 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa