ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీకి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను కొనసాగించాలని వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. దీంతో మంత్రి బొత్స సత్యనారాయణ ఈ అంశంపై స్పందించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదని.. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా అని ప్రశ్నించారు. 10ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని సాధ్యం కాదన్నారు. రాజధానిపై కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి లబ్ధి పొందాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు.
వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని.. హైదరాబద్ విశ్వనగరం అది ఏమైనా వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఆస్తా అంటూ మండిపడ్డారు. తాటాకు చప్పుళ్లుకు భయపడేది లేదని.. అర్ధరాత్రి చంద్రబాబు హైదరాబద్ నుంచి పారిపోయి వచ్చిన కారణంగా ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది అన్నారు. ప్రభుత్వంపై ఏడవటం తప్ప ప్రతిపక్షాలకు వేరే పని లేదని.. చంద్రబాబు పాపాల వల్లే ఈ పరిస్థితి వచ్చింది అన్నారు. ప్రతిపక్షాల చౌకబారు వ్యాఖ్యలపై తాము స్పందించబోమన్నారు.
హైదరాబాద్లో ఎవరికైనా ఆస్తులు ఉండొచ్చని.. తనకు అక్కడ ఇల్లు ఉందన్నారు. ఏపీలో మంత్రిని అయితే హైదరాబాద్లో ఉన్న ఆస్తిని ప్రభుత్వం కబ్జా చేస్తుందా? అని ప్రశ్నించారు. ఏపీలో ఓట్లు, డోరు నెంబర్లు కూడా లేని వాళ్ళు రాష్ర్టంలో ప్రతిపక్ష నేతలని ఎద్దేవా చేశారు.వాళ్ల అడ్రస్ ఏదీ అంటే పక్కింట్లో డోర్ నెంబర్ చెప్పే పరిస్థితి ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఏ డొంకల్లోకి, సందుల్లోకి దూరతాయో వాళ్ల ఇష్టమన్నారు.
అలాగే ఉద్యోగులకు బకాయిలు అనేది కొత్త కాదని.. ప్రభుత్వంగా కొంత ఆలస్యం అయినా అన్ని పరిష్కారం చేస్తామన్నారు. పీఎఫ్ సహా అన్ని బకాయిలు ఒకటి రెండు నెలలో తీరుస్తామని.. ఉద్యోగుల ఆందోళన ఎందుకో తనకు తెలియదన్నారు. ఇప్పటికే అనేక మార్లు చర్చలు జరిపామన్నారు. తమ పార్టీ స్టాండ్ ఎప్పుడు కూడా విభజన హామీలు సాధించడమేనన్నారు బొత్స. తాము ప్రజలు ఏం మేలు చేశామో అది చెప్పే ఓట్లు అడుగుతాం ఇలాంటి జిమ్మిక్కులు తమకు అవసరం లేదన్నారు. చంద్రబాబు, పవన్కు ఈ రాష్ట్రంలో సొంత ఇల్లు లేదని.. కానీ వీళ్లకి ఇక్కడ రాజకీయాలు కావాలన్నారు. తమ నాయకుడు సీఎం జగన్ ఒకటే చెప్తున్నారని.. తాము మంచి చేశాం అనుకుంటేనే మళ్లీ అవకాశం ఇవ్వండి అంటున్నారన్నారు. అలా అనడంలో తప్పు ఏముంది? అని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa