అనారోగ్యంతో భర్త చనిపోతే.. కట్టుకున్నవాడు ఇకలేడనే మనోవేదనతో భార్య కూడా ప్రాణాలు వదిలేసిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామానికి చెందిన కోసూరి సత్యనారాయణ (77) వడ్రంగి పని చేస్తూ జీవిస్తుంటారు. అతని భార్య వరలక్ష్మి (65). వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. పిల్లలకు పెళ్లిళ్లు చేసి సాగనంపిన ఈ దంపతులు.. పెళ్లైన నాటి నుంచి అన్యోన్యంగా కాపురం సాగిస్తూ ఆదర్శ దంపతులుగా అందరి మన్ననలు పొందారు . అయితే వయసు పెరగడంతో సత్యనారాయణను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో నే అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున సత్యనారాయణ కన్నుమూశారు.
అయితే భర్త మరణాన్ని ఆ ఇల్లాలు తట్టుకోలేకపోయింది. పెళ్లైన నాటి నుంచి తనకు కష్ట సుఖాల్లో తోడూనీడగా నిలిచినవాడు, కలకాలం తనకు తోడుగా ఉంటానంటూ బాసలు చేసినవాడు ఇక లేడు, రాడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయింది. కట్టుకున్నవాడు తనను వదిలేసి అనంతలోకాలకు వెళ్లిపోయాడనే మనో వ్యధతో సత్యనారాయణ మృతదేహం పక్కనే రోదిస్తూ తనువు చాలించింది వరలక్ష్మి. ఈ ఘటన ఆ కుటుంబాన్ని, ఆ ఊరి జనాలను విషాదంలో ముంచివేసింది. ఇన్నిరోజులు అప్యాయంగా పలకరిస్తూ, ఎంతో అన్యోన్యంగా మెలుగుతూ కనిపించిన దంపతులు.. ఒకేరోజు తనువు చాలించడంతో తంటికొండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇన్నిరోజులు కలిసి జీవించినవారు.. కలిసి ఆ దేవుడి దగ్గరకు వెళ్లారంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa