ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోవిడ్ టీకాలతో పెరిగిన గుండెపోట్లు, మెదడు సంబంధిత వ్యాధులు.. డబ్ల్యూహెచ్ఓ అధ్యయనం

international |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 11:56 PM

కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన టీకాలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు.. ప్రపంచాన్ని కరోనా వైరస్ నుంచి బయటపడేసే ప్రయత్నం చేశారు. కరోనా నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటంలో వ్యాక్సిన్లది కీలక పాత్ర. కానీ, టీకాలు దుష్ప్రభావం వల్లే గుండె, మెదడు సంబంధిత వ్యాధులు వంటివి చోటుచేసుకుంటున్నాయనే వార్తలు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా ఇటీవల పెరుగుతున్న గుండె, మెదడు, రక్త సంబంధిత వ్యాధులకు కరోనా వ్యాక్సిన్లే కారణమని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధ్యయనం ఒకటి వెల్లడించింది. వివిధ దేశాల్లోని టీకా తీసుకున్న పలువురిలో గుండె సమస్యలు, మెదడు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ పరిశోధన విభాగం గ్లోబల్ వ్యాక్సిన్ డేటా నెట్‌వర్క్‌కు చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ అధ్యయన ఫలితాలను వ్యాక్సిన్‌ అనే సైన్స్‌ జర్నల్‌లో నివేదించారు.


 కోవిడ్‌-19 వ్యాక్సిన్లు 13 రకాల ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేశాయని అధ్యయనకర్తలు తెలిపారు. భారత్‌ మినహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, న్యూజిలాండ్‌, స్కాట్లాండ్‌ వంటి దేశాల్లో టీకా తీసుకున్న 9.9 కోట్ల మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. కొన్ని రకాల ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో గుండె కండరాల వాపునకు కారణమయ్యే మయోకార్డిటిస్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వారు గుర్తించారు. దీనితోపాటు గులియన్‌ బారె సిండ్రోమ్‌, పెర్కిర్డిటిస్‌, సెరిబ్రల్‌ వీనస్‌ సైనస్‌ థ్రాంబోసిస్‌ వంటి కేసులు 1.5 రెట్లు పెరిగాయని వివరించారు.


ఫైజర్‌-బయోఎన్‌టెక్‌, మోడెర్నాకు చెందిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల మొదటి దశ మూడు డోస్‌లు తీసుకున్న వారిలో మయోకార్డిటిస్‌ కేసులను ఎక్కువగా గుర్తించడం గమనార్హం. మోడెర్నా రెండో డోసు తీసుకున్న తర్వాత ఈ కేసులు ఎక్కువగా పెరిగాయని పేర్కొన్నారు. అలాగే, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకున్న వారిలో పెరికార్డిటిస్‌ అనే గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 6.9 శాతం, మోడెర్నా టీకా నాలుగో డోసు తీసుకున్న వారిలో ఈ ముప్పు 2.6 శాతం పెరిగినట్టు గుర్తించారు. ఆస్ట్రాజెనెకా టీకాలు తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టే వ్యాధిబారిన పడే ప్రమాదం 3.2 రెట్లు ఎక్కువగా ఉందని, రోగనిరోధక వ్యవస్థ, నరాలపై దాడి చేసే గులియన్‌ బారె సిండ్రోమ్‌ను కూడా గుర్తించినట్టు చెప్పారు.


అయితే, కోవిడ్‌-19 టీకాలు వేసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల కంటే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు తేల్చిచెప్పారు. కాబట్టి కరోనా టీకా తీసుకోవడం ఇప్పటికీ సురక్షితమైన మార్గమని స్పష్టం చేశారు. ఇక, కరోనా బారినపడ్డవారిలో చాలా మంది ఏడాదిలోనే కోలుకోగా.. మరికొందరికి ఊపిరితుత్తులు శాశ్వతంగా దెబ్బతిన్నాయని తాజా అధ్యయనంలో గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు.


గ్లోబల్ వ్యాక్సిన్ డేటా నెట్‌వర్క్ కో-డైరెక్టర్ ప్రొపెసర్ జిమ్ బుట్టేరీ మాట్లాడుతూ.. ఈ అధ్యయనం రెండో దశ పూర్తి చేయడం ద్వారా దుష్ప్రభావాన్ని స్వతంత్రంగా నిర్ధారించడానికి పరిశోధకులను ప్రేరేపించింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ని పొందిన 6.8 మిలియన్ల ఆస్ట్రేలియన్ల ప్రత్యేక డేటాను విశ్లేషించామని చెప్పారు. ఎన్సెఫలో మైలిటిస్‌ను అరుదైన దుష్ప్రభావంగా నిర్ధారించడమే కాకుండా పెద్ద మొత్తంలో ట్రాన్స్‌వెర్స్ మైలిటిస్ బారినపడ్డట్టు గుర్తించామని వివరించారు. ఎన్‌సెఫలో మైలిటీస్ ప్రతి మిలియన్ డోస్‌లకు 0.78, ట్రాన్స్‌వర్స్ మైలిటిస్ 1.82 కేసులు నమోదైనట్టు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa