ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐదేళ్లలో మేం చేసింది ఇదీ.. మీరేమన్నా గాడిదలు కాశారా.. లెక్కలతో సహా చెప్పిన వైసీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 07:19 PM

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పార్టీల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. అధికార, విపక్షాలు రెండూ నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజులో తలపడుతున్నాయి. ఐదేళ్లలో ఏపీకి వైసీపీ ఏం చేసిందంటూ టీడీపీ ప్రశ్నిస్తోంది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చారంటూ ఆరోపిస్తోంది. పోలవరం, ప్రత్యేకహోదా, రైల్వేజోన్ వంటి అంశాలను తెరపైకి తెస్తూ టీడీపీతో పాటు జనసేన, కాంగ్రెస్ పార్టీలు జగన్ మీద విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐదేళ్లలో ఏపీకి మేం చేసింది ఇదీ అంటూ వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేసింది. జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీలో జరిగిన అభివృద్ధి ఇది అంటూ వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.


ఐదేళ్లలో ఏపీలో17 కొత్త మెడికల్ కాలేజీలు,10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్టులు, 2 ఎయిర్‌‌పోర్టులు నిర్మించామని వైసీపీ ట్వీట్ చేసింది. అలాగే 15,000 సచివాలయాలు, 10 వేల రైతు భరోసా కేంద్రాలు,10 వేల విలేజ్ క్లినిక్‌లు, 542 అర్బన్ హెల్త్ సెంటర్స్, 1126 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చింది. ఇక ఏపీలో ఇళ్లు లేని నిరుపేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు అందించామన్న వైసీపీ.. 22 లక్షల పక్కా ఇళ్లు నిర్మించినట్లు తెలిపింది.16 వేల కోట్లతో సర్కార్ బడుల రూపురేఖలు మార్చామని..17,230 కి.మీ మేర రహదారుల నిర్మించామని చెప్పుకొచ్చింది.


ప్రజలకు ఇళ్లవద్దకే పౌరసేవలు అందాలనే ఉద్దేశంతో2.65 లక్షల మంది వాలంటీర్లు ద్వారా ఇళ్ల వద్దకే ప్రభుత్వ కార్యక్రమాల లబ్ధిని అందిస్తున్నామని వైసీపీ ట్వీట్ చేసింది. జగన్ పాలనలో తలసరి ఆదాయంలో ఏపీ టాప్ టెన్‌ రాష్ట్రాలలో ఉందని గుర్తుచేసింది. జీఎస్‌డీపీ వృద్ధిరేటులో,ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ టాప్‌లో ఉందని తెలిపింది. వ్యవసాయ వృద్ధిరేటులో తొలి ఆరు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందని వైసీపీ ట్వీట్ చేసింది. రాష్ట్రంలో 2.5 లక్షల ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటయ్యాయనీ.. పారిశ్రామిక వృద్ధిరేటులో ఏపీ టాప్ త్రీలో ఉందంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.


రైతు భరోసా ద్వారా 52 లక్షల మంది రైతులకు సాయం చేశామని.. ఫ్యామిలీ డాక్టర్‌తో 2 కోట్ల మందికి వైద్యం అందించామని చెప్పింది. దిశ యాప్‌తో 1.25 కోట్ల అక్కచెల్లమ్మలకి భద్రత కల్పించామన్న వైఎస్ఆర్‌సీపీ..37.53 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారం కూడా చూపించినట్లు తెలిపింది. 2 లక్షల ఎకరాల చుక్కల భూములకి యాజమాన్య హక్కులు కల్పించామని చెప్పుకొచ్చింది. 54 లక్షల మందికి ఉచిత పంటల బీమా అమలు చేశామనీ, 16 వేల కోట్లతో ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించామని ట్వీట్ చేసింది. ఈ వివరాలన్నీ వెల్లడించిన వైసీపీ.. ఇదీ ఐదేళ్లలో జగనన్న చేసిన అభివృద్ధి అని.. మరి మీ ఐదేళ్లలో మీరు గాడిదలు కాశారా అంటూ టీడీపీని ప్రశ్నించింది.


మరోవైపు వైసీపీ ట్వీట్‌కు తెలుగుదేశం శ్రేణులు కూడా అదేస్థాయిలో రిప్లైలు ఇస్తున్నారు. 98 శాతం ఇచ్చిన హామీలు అమలు చేశామంటున్న వైసీపీ.. . మద్యనిషేధం, ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం, రాజధాని, సీపీఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa