ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. రాజమండ్రిలో అయితే ఈ వ్యవహారం పీక్స్కు చేరింది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ వార్నింగ్ ఇచ్చారు. సిద్ధం సభ వేదికగా చెప్పు చూపించి మరీ అప్పారావుకు భరత్ వార్నింగ్ ఇచ్చారు. అయితే దీనంతటికీ ఓ మహిళా వాలంటీర్ వ్యవహారమే కారణమైంది.
ఓ మహిళా వాలంటీర్ను ఆదిరెడ్డి అప్పారావు బెదిరించినట్లుగా ఓ ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోన్ కాల్ ద్వారా మహిళా వాలంటీర్ను అప్పారావు బెదిరించినట్లు ఆడియో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రిలో జరిగిన సిద్ధం సభలో పాల్గొన్న ఎంపీ మార్గాని భరత్.. అప్పారావుపై మండిపడ్డారు. వాలంటీర్ను ఆదిరెడ్డి అప్పారావు బెదిరించాడన్న మార్గాని భరత్.. బహిరంగ సభలోనే దీనికి సంబంధించిన ఆడియోను వినిపించారు. వాలంటీర్లను ఇలా బెదిరించేవారికి చెప్పు చూపిద్దామంటూ హెచ్చరించారు.
" వాలంటీర్ చెల్లెమ్మను బెదిరించిన వాడిని ఏం చేయాలి. చెప్పు తీద్దామా. నా వాలంటీర్ అక్కచెల్లెళ్లను, అన్నదమ్ముళ్లను సొంత తోబుట్టువుల్లాగా చూసుకుంటా. మేమేమీ గాజులు తొడుక్కొని కూర్చోలేదు. నా వాలంటీర్లు, నా రాజమండ్రి ప్రజల జోలికొస్తే ఊరుకునేది లేదు. సైకిల్ తొక్కుకుంటూ అద్దె ఇంట్లో ఉండేవాడివి, వందలకోట్లు ఎలా సంపాదించావ్" అంటూ మార్గాని భరత్, ఆదిరెడ్డి అప్పారావుకు వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది జగనేనని మార్గాని భరత్ ధీమా వ్యక్తం చేశారు. సంపూర్ణ మెజార్టీతో వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది కలిసి గుంపుగా వచ్చినా జగన్ను ఏమీ చేయలేరని భరత్ అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత లాభం కోసం జనసైనికులను మోసం చేస్తున్నారని రాజమండ్రి ఎంపీ ఆరోపించారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.