భారత్పై మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ చేసిన వ్యాఖ్యలకు విదేశాంగ మంత్రి జై శంకర్ కౌంటర్ ఇచ్చారు. వేధించేవాళ్లు, భయపెట్టేవాళ్లు ఎప్పుడూ ఇతర దేశాలకు సాయం చేయరని పేర్కొన్నారు. ఈ సందర్భంగానే మాల్దీవులకు భారత ప్రభుత్వం ఇచ్చిన రూ. 38 వేల కోట్ల సహాయాన్ని గుర్తు చేశారు. భారత్కు పొరుగున ఉన్న దేశాలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నపుడు వారికి సమయానికి సాయం అందించడంలో భారత్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని జై శంకర్ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య పర్యాటక రంగం విషయంలో తలెత్తిన వివాదం వేళ.. మహ్మద్ మొయిజ్జూ వ్యాఖ్యలకు జై శంకర్ సమాధానం ఇచ్చారు.
జై శంకర్ రాసిన ‘వై భారత్ మ్యాటర్’ అనే పుస్తక ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపదలో ఉన్న దేశాలకు భారత్ సకాలంలో సహాయం అందించడంలో క్రియాశీల పాత్ర పోషించిందని వెల్లడించారు. ఇటీవలి కాలంలో భారత్కు, దాని పొరుగున ఉన్న దేశాలకు మధ్య సంబంధాల్లో చాలా మార్పు వచ్చిందని.. భారత దేశం ఒక రౌడీ దేశంలా బెదిరింపులకు దిగుతోందని జరుగుతున్న ప్రచారంపై స్పందించిన జై శంకర్.. వేధించే దేశాలెప్పుడూ 4.5 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.38 వేల కోట్ల) సహాయాన్ని అందించవని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాలన్నీ నిత్యావసరాల కోసం తీవ్ర అవస్థలు పడుతుంటే, ఆ దేశాల్లో జనం పిట్టల్లా రాలిపోతుంటే.. ఆ దేశాలకు వ్యాక్సిన్లు ఇవ్వవని పేర్కొన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరుగుతున్న యుద్ధాల కారణంగా.. అన్ని దేశాల అవసరాల కోసం నిబంధనలను పక్కన పెట్టి మరీ ఇంధనం, ఎరువులు, ఆహారం సరఫరా చేయవని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే గత కొంత కాలంగా పొరుగున ఉన్న దేశాలతో భారత్కు మంచి సంబంధాలు ఏర్పడ్డాయని జైశంకర్ తెలిపారు. బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు భారత్తో మెరుగైన సంబంధాలు కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ బంగ్లాదేశ్, నేపాల్ దేశాలతో పవర్ గ్రిడ్, రోడ్లు ఏర్పడ్డాయని వెల్లడించారు. జలమార్గాల వినియోగం కూడా ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం భారత వాణిజ్య సంస్థలు బంగ్లాదేశ్ పోర్టులను కూడా వినియోగిస్తున్నాయని తెలిపారు. గత కొన్నేళ్లుగా నేపాల్, శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులతో వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని స్పష్టం చేశారు.
భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలపై పరోక్షంగా ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాల్దీవులు చిన్న దేశం అయినప్పటికీ.. తమ దేశాన్ని బెదిరించే లైసెన్స్ ఏ దేశానికి లేదని భారత్ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలకు తాజాగా జైశంకర్ బదులిచ్చారు.
![]() |
![]() |