మళ్లీ గెలిచి విశాఖలోనే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సెటైర్లు వేశారు. జగన్ మళ్లీ గెలిచేది లేదు. ప్రమాణస్వీకారం చేసేదీ ఉండదని ఎద్దేవా చేశారు. బుధవారం తన నివాసంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడిన గంటా శ్రీనివాసరావు.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ నా కలల రాజధాని అని చెప్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి .. అభివృద్ధి మాటేమో కానీ, ఇక్కడున్న భూములను తాకట్టు పెట్టారని గంటా ఆరోపించారు. వైజాగ్లో 128 ఎకరాల ప్రభుత్వ భూమిని తాకట్టుపెట్టారనీ.. సచివాలయాన్నే తాకట్టుపెట్టిన వైసీపీ సర్కారుకు ఇదేమీ పెద్ద విషయం కాదని సెటైర్లు వేశారు.
ఉగాది పండుగకు వైజాగ్ వస్తామని చెప్పి.. ఇప్పుడు గెలిచాకా వస్తామని చెప్పడం ఎంత వరకూ కరెక్ట్ అని గంటా ప్రశ్నించారు. విజన్ వైజాగ్ డాక్యుమెంట్ రిలీజ్ చేసిన జగన్కు.. విశాఖ మీద చిత్తశుద్ధి ఉంటే ఇన్నిరోజులు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆఖర్లో ఇలా చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. ఇక వైసీపీ గురించి విశాఖ ప్రజలకు బాగా తెలుసన్న గంటా శ్రీనివాసరావు.. అందుకే 2014లో వైఎస్ విజయమ్మను ఓడించారని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లోనూ విశాఖలోని నాలుగు స్థానాలలో వైసీపీ ఓడిపోయిందని అన్నారు. ఆఖరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓడిపోయారన్న గంటా.. ఇవన్నీ గమనిస్తే వైసీపీకి విశాఖలో ఎంత విలువ ఉందో తెలుస్తుందంటూ ఎద్దేవా చేశారు.
విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జి, బస్ బేల నిర్మాణాల్లో వైసీపీ శక్తి తెలిసిపోయిందని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖపట్నంలో 17 హెలిప్యాడ్లు తప్ప ఎలాంటి నిర్మాణాలు చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. ఐటీ హబ్ను ఆపేసిన మీరు.. ఇంకేం అభివృద్ధి చేస్తారని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తే.. వైసీపీ ప్రభుత్వం రాగానే అడ్డుపడి నిలిపివేసిందని మండిపడ్డారు. 24 విద్యాసంస్థలకు తాము రాజధానిలో భూములు అందిస్తే.. ప్రస్తుతం రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. 2024 ఎన్నికలే వైసీపీకి చివరి ఎన్నికలని చెప్పిన గంటా శ్రీనివాసరావు.. వచ్చే ఎన్నికల్లో గెలిచి టీడీపీ, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.రాబోయే రోజుల్లో వైసీపీ అనే పార్టీ ఉందనే విషయం చరిత్రలో చెప్పుకోవడమే తప్ప.. ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని గంటా తీవ్రవ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa