విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ప్రమాదం తప్పింది. మంటలను ఆర్పేందుకు కొండమీదకు వచ్చిన ఓ ఫైరింజన్.. తిరిగి వెళ్లే సమయంలో అదుపుతప్పింది. బ్రేక్ ఫెయిల్ కావటంతో ఎదురుగా వచ్చిన బస్సు మీదకు దూసుకెళ్లింది. అయితే చాకచక్యంగా వ్యవహరించిన ఫైరింజన్ డ్రైవర్ వాహనాన్ని కొండవైపునకు తిప్పి ప్రమాదం తప్పించాడు. దీంతో భక్తులు అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
అసలు విషయంలోకి వస్తే.. ఆదివారం ఉదయం కొండపై ఉన్న ఓ చెత్తకుప్పలో మంటలు చెలరేగాయి. దీన్ని గ్రహించిన భక్తులు ఫైరింజన్కు సమాచారం అందించారు. వెంటనే ఫైరింజన్తో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే తిరిగి వెళ్లే సమయంలో ఊహించని ఘటన జరిగింది. ఫైరింజన్ బ్రేకులు ఫెయిల్ కావటంతో వాహనం అదుపుతప్పింది. ఘాట్ రోడ్ దిగుతూ ఉండగా, ఫైరింజిన్ బ్రేక్ ఫెయిలైంది. దీంతో అదుపుతప్పిన ఫైరింజన్.. ఎదురుగా వస్తున్న బస్సుపైకి దూసుకెళ్లింది. దీంతో అందులోని భక్తులు భయపడిపోయారు. అయితే అప్రమత్తతతో వ్యవహరించిన డ్రైవర్.. సమయస్ఫూర్తితో ప్రమాదాన్ని తప్పించాడు.
ఫైరింజన్ను కొండవైపు తిప్పిన డ్రైవర్.. డివైడర్ ను ఢీకొట్టారు. డివైడర్ను ఢీకొట్టి ఫైరింజన్ ఆగిపోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బెజవాడ దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. ఇక ఆదివారం కావటంతో రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే.. ఏంటి పరిస్థితి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాహనాల ఫిట్నెస్ ముందుగానే పరీక్షించుకోవాలని.. రద్దీ అధికంగా ఉన్న సమయంలో జాగ్రత్తగా తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa