తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త. భక్తుల దర్శనాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్టు దాతల ఆఫ్లైన్ టికెట్ల కోటాను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో తిరుమల శ్రీవారి దర్శనం వారికి సులువు కానుంది. శ్రీవాణి ట్రస్టుకు పదివేల రూపాయలు విరాళం అందించేవారికి 500 రూపాయలు అదనంగా చెల్లిస్తే శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఆన్లైన్, ఆఫ్ లైన్ రెండింటిలోనూ ఈ విధానం అమల్లో ఉంది. కొత్తగా తిరుపతి విమానాశ్రయంలోను శ్రీవాణి ట్రస్టు డొనేషన్ కౌంటర్ ప్రారంభించారు.
అయితే ఏపీలో ఎన్నికల కోడ్ కూసింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో గతంలో మాదిరిగా తిరుమలలో శ్రీవారి దర్శనానికి , వసతి సౌకర్యానికి సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ ఇటీవల స్పష్టం చేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే నిబంధనల ప్రకారం శ్రీవారి దర్శనం, వసతి కల్పిస్తామని స్పష్టం చేసింది. ధర్మకర్తల మండలి నిర్ణయంతో శనివారం నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి, వసతికి సిఫార్సు లేఖలను రద్దు చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది.
శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలు రద్దుచేసిన నేపథ్యంలో.. శ్రీవాణి ట్రస్టు దర్శనాల సంఖ్యను పెంచాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి దర్శనానికి రావాలనుకునే భక్తులకు ఇబ్బందులు కలగకుండా శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్ల కోటాను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 20 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 20 నుంచి 24వ తేదీవరకూ సాలకట్ల తెప్పోత్సవాలు జరుగుతాయి. రాత్రి 7 గంటల నుంచి 8 గంటలవరకూ పుష్కరిణిలో స్వామివారు విహరిస్తారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాలను తిరుమలకు వచ్చే భక్తులు గుర్తుంచుకోవాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa