ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేతల వర్గ పోరు.. మధ్యలో మేకపోతు ఎందుకు? అయ్యో పేపర్ తినేసిందే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 07:58 PM

పిల్లికి చెలగాటం.. ఎలకకు ప్రాణ సంకటం అనే మాటను అందరూ వినే వింటారు. అలాంటి పరిస్థితే జనసేన నేతల కారణంగా ఓ మేకపోతు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్న ఓ వర్గం నేతలు.. మరో వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వొద్దంటూ రోడ్డెక్కారు. మేకపోతు మెడలో ఫోటో వేసి నిరసన తెలుపుదామని ప్లాన్ చేశారు. కానీ మేకపోతు ఇచ్చిన ట్విస్టుతో.. రోడ్డుపై తంటాలు పడ్డారు. దాన్ని కూడా ఇబ్బంది పెట్టారు. అసలు సంగతిలోకి వస్తే.. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీలో వర్గపోరు రోజురోజుకి ముదురుతోంది. విశాఖపట్నం సౌత్ నుంచి జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్‌‌కు అవకాశం ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో అదే నియోజకవర్గానికి చెందిన 39వ వార్డు కార్పొరేటర్ మహ్మద్ సాదిక్ నేను కూడా ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నానని రంగంలో దిగారు. దీంతో ఇప్పుడు వంశీకృష్ణ వర్గానికి, సాదిక్ వర్గానికి మధ్య డిష్యుం డిష్యుం జరుగుతోంది.


బుధవారం మహ్మద్ సాదిక్ వర్గీయులు.. వంశీకృష్ణ కార్యాలయం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే సీటు వంశీకృష్ణకు ఇవ్వడానికి వీల్లేదంటూ నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ ముద్దు వంశీకృష్ణ వద్దంటూ నినదించారు. అక్కడితో ఆగకుండా తమ వెనకాల ఒక మేకపోతును తీసుకెళ్లారు. పేపర్ మీద ప్రింట్ చేయించుకుని వచ్చిన వంశీకృష్ణ ఫొటోను మేక తలకాయకు అతికించేందుకు ప్రయత్నించారు. అదేదో తినే వస్తువు అనుకుని పేపర్‌ను మేక తినడానికి ప్రయత్నించింది. దీంతో సాదిక్ వర్గీయులు కాసేపు మేకపోతుతో నృత్యాలు చేయాల్సి వచ్చింది. రెండు వర్గాల మధ్య పోరు ఏమో కానీ.. మధ్యలో ఈ మేకపోతును హింసించారు.


వంశీకృష్ణ, సాదిక్.. ఇద్దరూ వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చినవారే. 39వ వార్డు కార్పొరేటర్‌గా వైసీపీ నుంచి గెలిచి మహమ్మద్ సాదిక్.. గతేడాది డిసెంబర్‌లో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ సైతం గతేడాది డిసెంబర్‌లోనే జనసేన కండువా కప్పుకున్నారు. పవన్ సమక్షంలో గాజు గ్లాసును పట్టుకున్నారు. ఆ తర్వాత వంశీకృష్ణను జనసేన పార్టీ విశాఖ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడిగా పవన్ నియమించారు. ఇక జనసేన-టీడీపీ పొత్తు ఖరారైన తర్వాత విశాఖపట్నం ఈస్ట్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి ప్రెస్ మీట్లు పెట్టి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై తీవ్ర ఆరోపణలు చేశారు.


పొత్తులో భాగంగా విశాఖపట్నం సౌత్ సీటు జనసేనకు దక్కుతుందని.. వంశీకృష్ణ ఎమ్మెల్యేగా పోటీచేస్తారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. వంశీకృష్ణ కూడా ఇదే ఆశించారు. కానీ, ఇప్పపుడు మహ్మద్ సాదిక్ రేసులో నేను కూడా ఉన్నాను అంటున్నారు. ఈ పంచాయతీ ఎప్పుడు తేలుతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa