ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిఠాపురంలో పవన్‌కు భారీ షాక్.. నిన్నటిదాకా వెంటే.. ఇవాళ వైసీపీలోకి కీలక నేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 10:05 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్ తగిలింది. వచ్చే ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సారి లక్ష మెజారిటీ పక్కా అంటూ వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే పవన్ కళ్యాణ్‌కు ఇంతలోనే ఊహించని షాక్ తగిలింది. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ కీలక నేత పార్టీని వీడారు. వైసీపీలో చేరిపోయారు. పిఠాపురం జనసేన పార్టీ మాజీ ఇంఛార్జి మాకినీడి శేషుకుమారి జనసేనను వీడి వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆమె వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి. మిథున్‌రెడ్డి, పిఠాపురం వైసీపీ ఇంఛార్జి వంగా గీత పాల్గొన్నారు.


  2019లో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా శేషుకుమారి పోటీ చేశారు. అప్పటి ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన పెండెం దొరబాబు విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు రెండో స్థానం దక్కింది. ఇక జనసేన అభ్యర్థి శేషకుమారి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ స్వయంగా పిఠాపురం నుంచి బరిలో నిలుస్తున్నారు. వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. కాపు సామాజికవర్గ ఓటర్లు అధికంగా ఉన్నారనే కారణంతో పవన్ ఇక్కడి నుంచి పోటీకి మొగ్గుచూపగా.. వైసీపీ సైతం అంతే తెలివితో కాపు సామాజికవర్గ మహిళా నేత అయిన వంగా గీతను తమ అభ్యర్థిగా బరిలో నిలిపింది.


ఈ నేపథ్యంలో ఈసారి పిఠాపురంలో పోరు రసవత్తరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్తితుల్లో గత ఎన్నికల్లో సుమారు 29 వేల వరకూ ఓట్లు సాధించిన శేషుకుమారి పార్టీని వీడటం జనసేనకు కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితి అని చెప్తున్నారు. మరోవైపు జనసేన పార్టీకి నిబద్ధత లేదని శేషకుమారి విమర్శించారు. జనసేనకు విధివిధానాలు లేవన్న ఆమె.. పవన్ కళ్యాణ్‌ను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. సీఎం జగన్‌కు, ఆయనకు పోలికేంటని విమర్శించారు. మరి శేషకుమారి జనసేనను వీడి వైసీపీలో చేరటం ఫ్యాన్ పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడుతుందనేదీ ఎన్నికల ఫలితాల తర్వాత వెల్లడికానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa