ఇటీవల బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో చోటు చేసుకున్న బాంబు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఈ కేసు దర్యాప్తులో కర్ణాటక పోలీసులే కాకుండా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ-ఎన్ఐఏ అధికారులు కూడా రంగంలోకి దిగారు. నిందితుడి ఆనవాళ్లు గుర్తించిన పోలీసులు.. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే కర్ణాటకలో జరిగిన ఈ రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటన తమిళనాడులో పెను దుమారానికి కారణం అయింది. అందుకు ఒక కారణం కూడా ఉంది. కేంద్రమంత్రి శోభ కరంద్లాజే.. చేసిన వ్యాఖ్యలే తమిళ ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో లోక్సభ ఎన్నికల ముందు పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించిన కేంద్రమంత్రి శోభ కరంద్లాజే ఎట్టకేలకు తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలోనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.
రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో నిందితుడి స్వస్థలం మల్నాడు అని శోభ కరంద్లాజే ఇటీవల వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఆ నిందితుడు గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఆయుధాలను వినియోగించడంలో ఇచ్చే ట్రైనింగ్లో పాల్గొన్నాడని ప్రాథమికంగా తేలిందని కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇందుకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేస్తున్న బుజ్జగింపు రాజకీయాలే కారణమంటూ శోభ కరంద్లాజే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శోభ కరంద్లాజేపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు చేశారు.
ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణం కావడంతో ట్విటర్ వేదికగా ఆమె క్షమాపణలు తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలు ఏ వర్గాన్ని ఉద్దేశించినవని కావని తమిళనాడు ప్రజలకు తెలియజేయాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. కృష్ణగిరిలో శిక్షణ పొందిన నిందితుడిని ఉద్దేశించే తాను చెప్పారని.. అయితే తన వ్యాఖ్యలు కొందరిని బాధించాయని అర్థమైందని అందుకు తమిళనాడు సోదరసోదరీమణులకు క్షమాపణలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్పై తీవ్రంగా విరుచుకుపడిన శోభ కరంద్లాజే.. హిందువులు, బీజేపీ కార్యకర్తలే లక్ష్యంగా రాడికల్స్ను స్టాలిన్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు చేశారు.
మార్చి 1 వ తేదీన బెంగళూరు నగరంలోని బ్రూక్ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న ఫేమస్ రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో సిబ్బంది, కస్టమర్లు సహా మొత్తం 9 మంది గాయపడ్డారు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్ఐఏ అధికారులు.. ఆధారాలు సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు.. బాంబు పేలుడు ఘటనతో మూత పడిన రామేశ్వరం కేఫ్.. తిరిగి ఇటీవలె తిరిగి ప్రారంభం అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa