ట్రెండింగ్
Epaper    English    தமிழ்

58 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనివ్వడం ఏంటి.. సిద్ధూ మూసేవాలా పేరెంట్స్‌కు కేంద్రం షాక్

national |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 10:42 PM

పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత ఆయన తల్లిదండ్రులు ఇటీవలె ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే 58 ఏళ్ల వయసులో సిద్ధూ మూసేవాలా తల్లి ఆ బిడ్డకు జన్మనిచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఇదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 58 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనివ్వడం ఏంటని సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులకు కేంద్రం షాక్ ఇచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. అయితే ఈ పరిణామాలపై సిద్ధూ మూసేవాలా తండ్రి సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోందని తెలిపారు. తన బిడ్డకు సంబంధించిన అన్ని పత్రాలను అందిస్తానని.. ముందు ట్రీట్‌మెంట్ జరగనివ్వాలని విజ్ఞప్తి చేశారు.


సిద్ధూ మూసేవాలా 2022 లో చనిపోయిన తర్వాత ఆయన తల్లిదండ్రులు బల్కౌర్ సింగ్, చరణ్ కౌర్ మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్-ఐవీఎఫ్ ద్వారా సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు ఇటీవలె ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్.. సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమకు మగ బిడ్డ జన్మించాడని.. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. అయితే ఆ తర్వాతే ఈ ఐవీఎఫ్ అంశం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త ప్రశ్నను లేవనెత్తింది. 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ ద్వారా బిడ్డకు జన్మనివ్వడం సరైందేనా అనే సందేహాన్ని వ్యక్తం చేసింది.


ఈ క్రమంలోనే ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనేందుకు ఉన్న నియమ నిబంధనల గురించి ఆరా తీసింది. అంతేకాకుండా ఐవీఎఫ్ ద్వారా జన్మనిచ్చే మహిళల వయసు ఎంత ఉండాలి అనేదానిపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది. ఈ క్రమంలోనే సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ ఐవీఎఫ్ చికిత్సకు సంబంధించిన నివేదిక, పత్రాలను అందించాలని పంజాబ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్ 2021లోని సెక్షన్ 21(జీ)(i) ప్రకారం.. ఐవీఎఫ్ పద్దతి ద్వారా 21 నుంచి 50 ఏళ్లలోపు వయసు ఉన్నవారు మాత్రమే బిడ్డకి జన్మనివ్వడం సురక్షితం అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.


కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన ఆదేశాలతో పంజాబ్‌లో అధికారంలో ఉన్న భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం.. సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన ఆవేదనను వెల్లడించారు. తమ బిడ్డకు సంబంధించిన పత్రాలు అందించినప్పటికీ.. జిల్లా అధికారులు తమను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని.. దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, అధికారులు జోక్యం చేసుకోవాలని వేడుకున్నారు.


ప్రస్తుతం తల్లీ బిడ్డలకు ట్రీట్‌మెంట్ జరుగుతోందని.. అది పూర్తి అయిన తర్వాత అన్ని పత్రాలు ఇస్తానని.. అప్పటివరకు తమను ఇబ్బంది పెట్టొద్దని.. చికిత్స అందిచాలని విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు. చికిత్స తర్వాత అధికారులు, ప్రభుత్వం అడిగినపుడు తాను అందుబాటులో ఉంటానని.. చట్టపరమైన అన్ని పత్రాలను సమర్పిస్తానని తేల్చి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa