ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాప్ చేస్తున్నారంటూ టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. శనివారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ హాల్లో టీడీపీ అభ్యర్థులకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్పై నిఘాపెట్టారని ఆ పార్టీ ఆరోపించింది. ఓ కానిస్టేబుల్ను పట్టుకున్నామని టీడీపీ నేత బోండా ఉమ తెలిపారు. కేశినేని చిన్ని ఫోన్ ట్యాప్ చేస్తున్నట్లు అతడి నుంచి పలు ఆధారాలను సేకరించాని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు పంపితేనే తాను వచ్చినట్టు పట్టుబడిన వ్యక్తి చెప్పారని బోండా ఉమా ఆరోపించడం గమనార్హం. దీనిపై ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది.
‘తమ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తోందని ఓ సందర్భంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా బయటపెట్టారు.. పెగాసస్ సాఫ్ట్వేర్ను తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్తో కలిసి జగన్ కూడా కొనుగోలు చేశారు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి సహా పలువురు ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టారు.. ఫోన్లను ట్యాప్ చేసి మేము ఏం మాట్లాడినా వింటున్న పోలీసులు.. మా ఇళ్లు, ఆఫీసుల వద్ద గస్తీ కాస్తున్నారు.. మా విషయాలు పోలీసులకు ఎలా చేరుతున్నాయని సాంకేతిక నిపుణులతో పరిశీలన చేయిస్తే ఫోన్లు ట్యాప్ అయినట్లు నిర్ధరణ అయింది. దీనిపై సీఎం వెంటనే సమాధానం చెప్పాలి. ఈ కుట్రలు చేసినవారు, చేయిస్తున్న అందరిపై చర్యలు తీసుకుంటేనే ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పాక్షికంగా జరుగుతాయి’ అని బోండా ఉమా అన్నారు.
మరోవైపు, టీడీపీ నాయకుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య.. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇంటిలిజెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఈవో కు రాసిన లేఖలో కోరారు. ఎన్నికలు నిస్పక్షపాతంగా జరగాలని ఆయన పేర్కొన్నారు.
శనివారం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సమావేశంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ విశ్వేశ్వరరావు నకిలీ ఐడీ కార్డుతో పట్టుబడ్డారని ఆరోపించారు. ఇంటిలిజెన్స్ విభాగం నుంచి వచ్చానని, టీడీపీ నిర్వహించే మీటింగ్ ఫీడ్బ్యాక్ అందించేందుకు వచ్చినట్టు చెప్పాడని అన్నారు. కానిస్టేబుల్ ఫోన్ను పరిశీలించగా విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఫోన్ ట్యాప్ చేసినట్లు తెలిసిందన్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులు టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసేందుకు పెగాసెస్ సాఫ్ట్వేర్ వాడుతున్నారని అనుమానంగా ఉందన్నారు. ఆంజనేయులపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య కోరారు. కాగా, వర్క్షాపులో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలు, ప్రత్యర్థుల ఎత్తులను చిత్తుచేయడం గురించి అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశనం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa