ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలుగేళ్ల తర్వాత టీడీపీలో విలీనం.. లోకేష్ సమక్షంలో తెలుగు దేశంలో చేరిన నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 04, 2024, 08:03 PM

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు అనుకూలంగా అమరావతిలో ఏర్పాటైన శిబిరం మూతపడింది. గుంటూరు జిల్లా మందడం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు వద్ద దాదాపు నాలుగేళ్లుగా నిర్వహించిన మూడు రాజధానుల శిబిరాన్ని ఎత్తివేస్తున్నట్లు.. వైఎస్సార్‌సీపీ అనుబంధ బహుజన పరిరక్షణ సమితి నేతలు ప్రకటించారు. టీడీపీలో సమితిని విలీనం చేస్తున్నట్లుగా అధ్యక్షుడు గురునాథం తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో సమితి నేతలు బుధవారం టీడీపీలో చేరారు. వీరిలో అధ్యక్షుడు గుర్నాథంతోపాటు సంకే విశ్వనాథ్‌, యునైటెడ్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ అధ్యక్షులు అప్పికట్ల జవహర్‌ తదితరులు ఉన్నారు.


పరిపాలన వికేంద్రీకరణతో లాభం జరుగుతుందని నమ్మి మోసపోయామని బహుజన పరిరక్షణ సమితి అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరించి తమను నమ్మించే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. సీఎం జగన్‌ మాటలు నమ్మి మూడు రాజధానులు, పేదలకు 54 వేల ఇళ్ల పట్టాలు, ఆంగ్ల మాధ్యమం కోసం 2020 ఫిబ్రవరి నుంచి 2 నుంచి దాదాపు నాలుగేళ్లపాటు ఉద్యమం నిర్వహించి చివరకు మోసపోయామన్నారు. వికేంద్రీకరణ అంశం అస్తవ్యస్తంగా మారిందని.. దానిపై నమ్మకం కలిగించలేకపోయారన్నారు.


రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. రాజధాని అమరావతిలో పేదలకు పూర్తి న్యాయం చేసే భాధ్యత టీడీపీ తీసుకుంటుందని చంద్రబాబు తనకు హామీ ఇవ్వడంతో పార్టీలో చేరినట్లు గురునాథం తెలిపారు. అమరావతి రాజధాని రైతులకు మద్దతు పలుకుతున్నట్లు వెల్లడించారు. బహుజన రాజకీయ యాత్ర చేపట్టి జగన్‌ రాజకోట రహస్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి చెప్పిన మూడు రాజధానుల మాటలు నమ్మి తాము మోసపోయామన్నారు.


ప్రస్తుత పరిస్థితుల్లో పేదలకు తెదేపాతోనే న్యాయం జరుగుతుందని భావించి టీడీపీలో విలీనమవుతున్నామన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బహుజనుల్లో చైతన్యం తీసుకొచ్చి మద్దతు కూడగడతామన్నారు. మూడు రాజధానుల ఉద్యమం చేసిన గురునాథం స్వచ్ఛందంగా టీడీపీలో చేరానన్నారు. అరాచక శక్తులు ఉద్యమంలో చొరబడి, రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాయని.. మూడు రాజధానుల ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని అదే రాష్ట్ర ప్రజల అభిప్రాయమన్నట్లు జగన్‌ నమ్మించే ప్రయత్నం చేశారన్నారు. మూడురాజధానుల కోసం ఉద్యమం చేసిన వారంతా టీడీపీలో చేరుతున్నారన్నారు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్. మందడం సమీపంలోని తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు జంక్షన్‌లో 2020 ఫిబ్రవరి 9న మూడు రాజధానుల శిబిరం ఏర్పాటు చేశారు. దీనికి గురునాధం నాయకత్వం వహించారు.. ఇప్పుడు ఆయన శిబిరానికి గుడ్ బై చెప్పి తెలుగు దేశం పార్టీలో చేరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa