ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 04, 2024, 08:05 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది. బుధవారం వివిధ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. ఉదయం 7 గంటల నుంచే వేడి వాతావరణం కనిపిస్తోంది. ఎండలు, వేడి గాలుల దెబ్బకు వృద్ధులు, పిల్లలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. వడగాలుల తీవ్రత కూడా మరింత పెరగనుందని.. రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా కడప జిల్లాలోని కడప, ఒంటిమిట్ట, సిద్ధవటం ప్రాంతాల్లో 43.4 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరులో 43.3 డిగ్రీల చొప్పున, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లా వీరపునాయునిపల్లి మండలంలో తీవ్ర వడగాలులు, మరో 59 మండలాల్లో వడగాలులు వీచాయి.


గురువారం రాష్ట్రంలో 130 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. శుక్రవారం 5 మండలాల్లో తీవ్ర,253 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు బుధవారం.59 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.


ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి, వృద్దులు,గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి.డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS తాగాలని సూచిస్తున్నారు. వేసవి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఎండతీవ్రతతో పాటు వడగాల్పులు మరింత పెరుగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.


సాధారణంగా మే నెలలో ఎండలు మండుతాయి. ఆ నెలలోనే ఎక్కువగా వడగాలులూ వీస్తాయి. కానీ.. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఒక నెల ముందుగానే మార్చి మూడో వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా మార్చి నెలాఖరు నుంచే వడగాలులు వీస్తున్నాయి. ఏప్రిల్‌ ఆరంభం నుంచే మే నెల నాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల 40 నుంచి 44 డిగ్రీలు రికార్డవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మరింతగా ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా మే నెలలో అగ్నిగుండాన్ని తలపించేలా ఎండలు, వడగాలులు ప్రతాపం చూపనున్నాయి. సాధారణం కంటే 5–8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదై తీవ్ర వడగాలులకు దారితీయనున్నాయి.


మరోవైపు రాష్ట్రంలో ఈ వేసవిలో వడగాలుల రోజులు కూడా పెరగనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రంలో వేసవి కాలంలో సగటున ఐదు రోజులు వడగాలులు వీస్తాయి అంటున్నారు. రాష్ట్రంలో వడగాలుల ప్రభావం అప్పుడే మొదలైంది. కోస్తాంధ్ర కంటే రాయలసీమలోనే ఉష్ణతీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పలుచోట్ల 2–3 డిగ్రీలు, అక్కడక్కడ 4–5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాయలసీమతోపాటు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa