జనసేన శ్రేణులకు శుభవార్త. జ్వరం కారణంగా ఎన్నికల ప్రచారానికి దూరమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోలుకున్నారు. జ్వరం నుంచి కోలుకున్న పవన్ కళ్యాణ్ తిరిగి జనంలోకి రానున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని.. ఈ నెల 7వ తేదీన అనకాపల్లిలో జరిగే సభలో పాల్గొంటారని జనసేన తెలిపింది. ఏప్రిల్ 8న యలమంచిలిలో పవన్ వారాహి విజయభేరి యాత్ర కొనసాగనుంది. ఈ 9న పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అనంతరం నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, పెందుర్తి నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారని జనసేన తెలిపింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని ట్వీట్ చేసింది.
మార్చి30వ తేదీన కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వివిధ మండలాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్.. సుమారు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అప్పటికే అస్వస్థతతో ఉన్న పవన్ కళ్యాణ్.. ఎండలో పాదయాత్ర చేయటంతో అనారోగ్యం పాలయ్యారు. తీవ్రజ్వరంతో బాధపడ్డారు. దీంతో తెనాలిలో జరగాల్సిన వారాహి విజయభేరి యాత్రతో పాటుగా.. ఉత్తరాంధ్ర పర్యటనను వాయిదా వేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. వైద్యులు రెండు మూడురోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని.. కోలుకున్న తర్వాత పర్యటన వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే పవన్ జ్వరం నుంచి కోలుకోవటంతో తిరిగి వారాహి విజయభేరి యాత్ర మొదలవ్వనుంది.
మరోవైపు కూటమి తరుఫున ప్రస్తుతం జనసేన మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకూ పాలకొండ మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది జనసేన. 20 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ప్రస్తుతం పాలకొండ అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థిని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పాలకొండ అభ్యర్థిపై జనసేనాని దృష్టిసారించనున్నారు. అయితే పాలకొండలో ఇప్పటికే టీడీపీ నేత నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు. ఆయనకే టికెట్ దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ నుంచి ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa