కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలను నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. సామాన్యుడి దగ్గర నుంచి వీవీఐపీల వరకూ ఆ వెంకన్న దయ కోసం క్యూ కడుతూ ఉంటారు. ఇలా స్వామివారి దర్శనం కోసం వచ్చే హీరో, హీరోయిన్లు, వీఐపీలను మిగతా భక్తులు ఆసక్తిగా గమనించడం సాధారణం. వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడటం మరింత కామన్. కానీ ఓ సామాన్యుడిని చూసేందుకు తిరుమలలోని భక్తులు శుక్రవారం ఆసక్తి ప్రదర్శించారు. అతన్ని చూసి వామ్మో అంటూ కళ్లు పెద్దవి చేశారు. అలాగే వీడెవడండీ బాబూ.. గోల్డ్ మ్యాన్లా ఉన్నాడే అంటూ ముక్కున వేలేసుకున్నారు.
తిరుమలలో గోల్డ్ మ్యాన్ ప్రత్యక్షం, తిరుమలలో గోల్డ్ మ్యాన్ సందడి అనే వార్తలు ఇటీవలి కాలంలో చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘటనే శుక్రవారం జరిగింది. తిరుమలలో ఒంటి నిండా బంగారు నగలతో ఓ గోల్డ్ మ్యాన్ సందడి చేశాడు. కేజీల కొద్దీ బంగారాన్ని ఒంటిపై దిగేసుకుని అతగాడు.. అలా నడుస్తూ ఉంటే మిగతా భక్తులు కళ్లు పెద్దవి చేసి మరీ గమనించారు. ఇక అతగాడి వివరాల్లోకి వెళ్తే.. ఆయన పేరు గడ్డిపాటి సాంబశివరావు. ఊరు గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని పెదవడ్లపూడి. ఎప్పటి నుంచో శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్న సాంబశివరావు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. అది కూడా అలా ఇలా కాదండోయ్. ఒంటి మీద మూడు కేజీల బంగారు నగలు వేసుకుని మరీ శ్రీవారి దర్శనానికి విచ్చేశారు.
చేతి వేళ్లకు ఉంగరాలు, కంకణాలు, మెడలో బంగారు గొలుసు, శ్రీనివాసుడి డాలర్ ఇలా ఒంటిపై మూడు కేజీల బంగారు నగలు వేసుకుని సాంబశివరావు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపలకి వచ్చిన గోల్డ్ మ్యాన్ సాంబశివరావును భక్తులంతా ఆసక్తిగా గమనించారు. ఒంటిపై మూడు కిలోల బంగారాన్ని ధరించి ఆలయానికి వచ్చిన గోల్డ్ మ్యాన్ను చూసి షాక్ తిన్నారు. ఆశ్చర్యంతో గమనించారు. కొంతమంది ఫోటోలు కూడా తీసుకోగా.. మరి కొంతమంది సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. మొత్తంగా నగల దుకాణమే స్వయంగా తిరుమలకు వచ్చిందా అనే రీతిలో మనోడు తిరుమలలో సందడి చేశారు.
మరోవైపు గురవారం శ్రీవారిని 62,549 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,816 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ద్వారా గురువారం 3.33 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. మొత్తం 18 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచిచూశారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పట్టినట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa