తిరుమలలో కొందరు భక్తులు కాళ్లకు గోనె సంచులు కట్టుకుని కనిపించారు. ఏమైందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. తిరుమల కొండపై విపరీతంగా ఎండ తీవ్రత పెరిగింది. మధ్యాహ్నం సమయంలో ఎండను చూస్తే నిప్పుల కొలిమిలా అనిపిస్తోంది. ఈ క్రమంలో ఆలయ పరిసర ప్రాంతాల్లోని కాలిబాట కూల్ పెయింట్ కొన్ని చోట్ల వేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు భక్తులు ఆ వేడి నుంచి పాదాలను కాపాడుకునేందుకు ఇలా కాళ్లకు లడ్డూ ప్రసాద వితరణకు వినియోగించే జూట్ బ్యాగులను పాదాలకు ధరించి భక్తులు నడుస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనే టీటీడీ వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ కూల్ పెయింట్ వేసి వేసవి ఉపశమన చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో జనాలు అల్లాడిపోతున్నారు. వాతావరణంలో మార్పుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, దీనికితోడు ఈ ఏడాది ఎల్నినో తీవ్రత కొనసాగుతున్నందున ఏప్రిల్ నుంచి జూన్ వరకు వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ వేసవి సీజన్లో వడగాడ్పులు ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో సగటున 10 నుంచి 12 రోజులు, మిగిలిన ప్రాంతాల్లో ఆరు నుంచి ఎనిమిది రోజుల వరకు వీస్తాయని అంచనావేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత, వడగాల్పులు ఇంకాస్త పెరిగాయి. గురువారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 44.1 డిగ్రీలు, కడప జిల్లా చిన్నచెప్పల్లిలో 43.9, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.8, ప్రకాశం జిల్లా దరిమడుగులో 43.8, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 21 మండలాల్లో తీవ్రంగా, 97 మండలాల్లో మోస్తరు వడగాల్పులు వీచాయు. శుక్ర, శనివారాల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మండలాల్లో తీవ్రంగా, అనేక మండలా ల్లో మోస్తరు వడగాల్పులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. తిరుమల కొండపై కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ఏప్రిల్ 6న అయోధ్యకాండ 9వ విడత అఖండ పారాయణం
లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఏప్రిల్ 9వ తేదీ శనివారం 9వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం జరుగనుంది. ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అయోధ్యకాండలోని 31 నుండి 34వ సర్గ వరకు మొత్తం నాలుగు సర్గల్లో 172 శ్లోకాలు, యోగవాశిష్టం మరియు ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 197 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్.వి.వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి.వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరింది టీటీడీ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa