ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా ప్రథమ శత్రువు ఆయనే.. పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 05, 2024, 07:37 PM

చిత్తూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి, నారా, నల్లారి, గల్లా కుటుంబాలదే రాజకీయ ఆధిపత్యం. అయితే ప్రస్తుతం సీన్ మారింది. గల్లా, నల్లారి కుటుంబాలు టీడీపీలో చేరిపోగా.. పెద్దిరెడ్డి ఫ్యామిలీ వైసీపీలో ఉంది. గల్లా కుటుంబం రాజకీయాల నుంచి వైదొలగ్గా.. నల్లారి ఫ్యామిలీ నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తరుఫున పీలేరులో బరిలో ఉన్నారు. అలాగే మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరి రాజంపేట లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి మీద ఓ రేంజులో విరుచుకుపడుతున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తన ఎన్నికల ప్రచారంలో కిరణ్ కుమార్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.


శుక్రవారం పుంగనూరు మండలం ఆరేడిగుంటలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీని మరోసారి ఆశీర్వదించాలని పెద్దిరెడ్డి కోరారు. అలాగే గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులపై గెలిచిన మిథున్ రెడ్డిని ఈ ఎన్నికల్లోనూ రాజంపేట ఎంపీగా మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లో తన ప్రథమ శత్రువు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. పుంగనూరు ప్రాంతానికి తాగునీరు అందించే ప్రాజెక్టును కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. సీఎంగా పనిచేసిన సమయంలో పింఛా ప్రాజెక్టు పనులను కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. రోడ్లను సైతం పీలేరు వరకే వేసుకున్నారని విమర్శించారు. అలాగే వైఎస్ జగన్‌ను కిరణ్ కుమార్ రెడ్డి వేధించారని ఆరోపించిన పెద్దిరెడ్డి.. జగన్‎ను 16 నెలలు జైలుకు పంపి, ఏపీ విడిపోవడానికి కారణమయ్యారని మండిపడ్డారు.


ఇక ఏపీ విడిపోవటానికి, ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కిరణ్ కుమార్ రెడ్డే కారణమని ఆరోపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కిరణ్ కుమార్ రెడ్డిని నమ్మకద్రోహి అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అతన్ని చిత్తుచిత్తుగా ఓడిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున సీఎంగా పనిచేసి.. ఇప్పుడు సిగ్గులేకుండా బీజేపీ అభ్యర్థిగా మనముందుకు వస్తున్నారని.. కిరణ్ కుమార్ రెడ్డిని ఓడించి.. మిథున్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa